ఇంజినీరింగ్ విద్యార్థి అయిన అకీల్ జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీలు వేగంగా చేయాలనే విషయం తెలిసిందే. బైక్ లేదా స్కూటీలపై డెలివరీ చేసే ఏజెంట్లను చూసే ఉంటాం. అయితే బైక్ కొనేంత డబ్బులు లేకపోవడంతో అకీల్ సైకిల్ మీద డెలివరీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్గా కింగ్ కోఠిలో ఉండే రాబిన్ ముఖేశ్ చాయ్ను ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఆర్డర్ను అందుకున్న అకీల్ సైకిల్ మీద 20 నిమిషాల్లో 9 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ముఖేశ్కు డెలివరీని అందించాడు. సైకిల్ మీద అకీల్ ఫుడ్ డెలివరీ చేయడం చూసిన ముఖేశ్ అతడి ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి ఓ కథనం రాసి దాన్ని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.
అకీల్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని నెటిజన్స్ను కోరాడు. ముఖేశ్ గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్ అనే ప్రైవేట్ గ్రూప్లో సభ్యుడైన ముఖేశ్ నెటిజన్స్ను సాయం అడుగుతూ ఫండ్ రైజింగ్ను ఏర్పాటు చేశాడు. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. అకీల్ కథ గురించి తెలుసుకున్న నెటిజన్స్ అతడికి సాయమందించేందుకు ముందుకొచ్చారు. కేవలం 10 గంటల్లో రూ.60 వేలు జమయ్యాయి. ఈ డబ్బులకు ఫండ్ రైజింగ్ మనీని కలపగా మొత్తంగా రూ.73,370 అయ్యాయి.
గ్రూప్ మెంబర్స్తోపాటు నెటిజన్స్ సాయంతో కూడగట్టిన డబ్బులతో అకీల్కు రూ.65 వేల ధర కలిగిన టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్ కొనిచ్చామని ముఖేశ్ తెలిపాడు. మిగిలిన డబ్బులతో అకీల్ కాలేజీ ఫీజు చెల్లిస్తామని చెప్పాడు. అకీల్ పేరిట చేసిన ఫండ్ రైజింగ్ను ఆపేశామని పేర్కొన్నాడు.