భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ ఎంత డేరింగ్ డెసిషన్స్ తీసుకునేవారో అందరికీ తేలింసిందే. దాదా దూకుడు వల్లే ఇండియన్ క్రికెట్ జట్టు దృక్పధం మారింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా రాయల్ బెంగాల్ టైగర్ ఇలాంటి దూకుడే చూపిస్తన్నాడు. ఇందులో భాగంగానే చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది బీసీసీఐ. టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.., పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో జట్టును శ్రీలంకకి పంపాలని గంగూలీ డిసైడ్ అయ్యాడు. ఈ నెల 29న విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్నది. ఫైనల్ మ్యాచ్ అయిపోయాక మరో నెల రోజులు అక్కడే ఉండి ఇంగ్లాడ్ తో టెస్ట్ సీరీస్ ఆడనుంది. ఈ మధ్యలో ఇండియన్ టీమ్ శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ ట్వంటీలు ఆడాల్సి ఉంది. దీనితో శ్రీలంక పర్యటనకు వేరే జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక ఇప్పటికే ఈ మ్యాచ్ లకి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. అయితే.., గంగూలీ సాహసోపేత నిర్ణయం ఇక్కడితో ఆగిపోలేదు. శ్రీలంక టూర్ కి వెళ్లబోయే జట్టుకి రాహుల్ ద్రావిడ్ ని కోచ్ గా నియమించాడు గంగూలీ. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమీటి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ద్రావిడ్ ప్రస్తుతం అండర్-19 జట్టుకి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే.., బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా సమర్ధవంతంగా తన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు టీమ్ ఇండియాలో మెరుపులు మెరిపిస్తున్న సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వి షా, సుందర్, గిల్ లాంటి ఆటగాళ్లు అందరూ ద్రావిడ్ మార్గ దర్శకంలోనే తమని తాము మెరుగు పరుచుకున్న వారే. నిజానికి ద్రావిడ్ కోరుకుంటే ఆయనకి టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు అప్పగించడానికి బీసీసీఐ ఎప్పటి నుండో సిద్ధంగా ఉంది. కానీ.., ద్రావిడ్ మాత్రం యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితం అయిపోయాడు. కానీ.., రానున్న కాలంలో ద్రావిడ్ నే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా నియమించాలని గంగూలీ డిసైడ్ అయిపోయాడట. ఇందుకు కారణం లేకపోలేదు. నవంబర్ లో జరగనున్న టి-ట్వంటీ వరల్డ్ కప్ తో హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగుస్తుంది. ఆ తరువాత శాస్తి కాంట్రాక్ట్ ని పొడిగించే ఆలోచనలో బీసీసీఐ లేదట. ద్రావిడ్ ని హెడ్ కోచ్ గా నియమించి.., దీర్ఘ కాలిక కాంట్రాక్ట్ కనుక అతనికి అప్పగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నది బీసీసీఐ ప్లాన్. ఇదే సమయంలో టెస్ట్ ఆటగాళ్లకి కూడా ద్రావిడ్ సూచనలు ఉపయోగపడుతాయి. ఇక రాహుల్ ద్రావిడ్ ఆటగాడిగా 1996 నుండి 2012 వరకు భారత క్రికెట్ జట్టులో అద్భుతాలు సృష్టించాడు. టీమ్ అంతా కుప్ప కూలిపోతున్న సమయంలో ఒక గోడలా ద్రావిడ్ క్రీజ్ లో నిలబడిపోయిన సందర్భాలు ఎన్నో. అందుకే ద్రావిడ్ ని వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటారు. మరి.., సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమీటి ఆలోచనకి ద్రావిడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.