విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్వాతంత్ర్యం రాక ముందు దేశం దీనస్థితిలో ఉందని.. కోహినూర్ వజ్రంతో సహా విలువైనవెన్నో బ్రిటిషర్స్ దోచుకున్నారని అన్నారు. అయితే ఇప్పుడు భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, వైద్యరంగానికి భారతదేశం ప్రపంచానికే ఒక మైలురాయిలా మారిందని అన్నారు. ప్రపంచానికి మొదటి కోవిడ్ వ్యాక్సిన్ మన దేశమే ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తాను టీడీపీలో అసంతృప్తిగా లేనని, తనపై అనవసరంగా ఫోకస్ చేయొద్దని మీడియాను కోరారు.
తాను ఎంపీగా ఉన్నా, లేకపోయినా విజయవాడకు నష్టమేమీ లేదని, తనలాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కారుకు మాత్రమే ఎంపీ స్టిక్కర్ ఉంటుందని, మిగతా తన కార్లపై ఎంపీ స్టిక్కర్ ఉండదని, స్టిక్కర్ ఉండడం తనకు నచ్చదని అన్నారు. ఆ కారులో తన కూతుర్ని కూడా తిరగనివ్వనని అన్నారు. ఇక వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో గురించి మాట్లాడుతూ.. అదేమీ ప్రైవేట్ వ్యవహారం కాదని, మహిళలకి సంబంధించిన విషయమని అన్నారు. రాజకీయ నాయకులు నిస్వార్ధంగా పనిచేయాలని కేశినేని నాని అన్నారు. మరి కేశినేని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.