భార్య హోదా కన్నా తల్లిగా మారాలని మహిళ తపన పడిపోతుంటుంది. పెళ్లై సంవత్సరం అవుతుందో లేదో అత్తింటి వారు ‘ఏమ్మా ఏమన్న విశేషమా’అని లేదా ‘మమ్మల్ని నాన్నమ్మ, తాతయ్యలను చేసేది ఎప్పుడు’అంటూ ప్రశ్నలు మొదలు పెడతారు.
మాతృత్వం తియ్యటి వరం. భార్య హోదా కన్నా తల్లిగా మారాలని మహిళ తపన పడిపోతుంటుంది. పెళ్లై సంవత్సరం అవుతుందో లేదో అత్తింటి వారు ‘ఏమ్మా ఏమన్న విశేషమా’అని లేదా ‘మమ్మల్ని నాన్నమ్మ, తాతయ్యలను చేసేది ఎప్పుడు’అంటూ ప్రశ్నలు మొదలు పెడతారు. ఇక ఇరుగింటి పొరుగింటి వాళ్లయితే సూటి పొటి మాటలు, గోడ్రాలు అన్న నిందలు వేయడం, ఏ వేడుకకు పిలవకపోవడం చేస్తుంటారు. దీంతో ఆమె మానసికంగా నలిగిపోతుంటుంది. ఈ నిందలు పడలేక ఎన్నో ఆసుప్రతులు చుట్టూ తిరుగుతుంటారు దంపతులు. అలాగే మొక్కని దేవుడు కూడా ఉండడు. పిల్లలు కలగాలని తల్లిదండ్రులుగా మారాలని ఆశపడుతుంటారు.
ఆమె ఇలాంటి అవమానాలే ఎదుర్కొంది. చివరకు 20 ఏళ్లకు గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. అయితే కవలలు అని తెలిసి మురిసిపోయింది ఆ కుటుంబం. ఇక తల్లిగా తనకు దక్కిన వరానికి మురిసిపోయిందా మహిళ. కానీ మాతృత్వపు అనుభూతిని పొందకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. బిడ్డల్ని చూడకుండానే కన్నుమూసింది ఆ తల్లి. ఈ హృదయ విదారకమైన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం మాగల్లుకు చెందిన షేక్ నజీరా.. పల్లగిరికి చెందిన ఆటో డ్రైవర్ ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. అయితే అప్పటి నుండి ఈ దంపతులకు పిల్లలు లేరు. ఎట్టకేలకు నజీరా గర్భం దాల్చింది.
పది రోజుల క్రితం ఆమెకు పురి నొప్పులు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆపరేషన్ చేయగా.. ముగ్గురు కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఒక మగ పిల్లవాడు ఉన్నాడు. బిడ్డల్ని సరిగ్గా చూసుకోలేదు. బరువు తక్కువ ఉండటంతో పిలల్ని ఐసీయూలో ఉంచారు. నజీరాకు రక్తం తక్కువ ఉండటంతో రక్తం ఎక్కించారు. చికిత్స పొందుతూనే ఆమె మరణించింది. కనీసం పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండానే ఆ తల్లి కన్నుమూసింది. ఆమెను బతికించుకోవాలనుకున్న అతడి ప్రయత్నం విఫలమైంది. బిడ్డలను తనకు అప్పగించి భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంపై ఖాసిం కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు.