ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెరమీదకు వచ్చిన ప్రోటోకాల్ అంశం అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగ్గిని రాజేసింది. ప్రధానికి స్వాగతం పలకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడం రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి దారి తీసింది. కేసీఆర్ తీరును బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. కావాలనే కేసీఆర్ మోదీని ఆహ్వానించలేదని.. మోదీకి భయపడ్డాడని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీనికి కౌంటర్గా రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని టార్గెట్ చేసి ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అనే హ్యాష్టాగ్ తో జాతీయ స్థాయిలో కేంద్రంపై తమ నిరసనస్వరాన్ని వినిపించడం ప్రారంభించారు.
ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ vs బీజేపీ.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన శిలాఫలకంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడానికే ఇలా శిలా ఫలకం మీద కేసీఆర్ పేరు లేకుండా చేశారని ఆరోపించడమే కాక.. శిలాఫలకం ఫోటోని సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి.. ప్రధానిని ఆహ్వానించకపోతే ఇలా చేస్తారా.. కావాలనే శిలా ఫలకం మీద కేసీఆర్ పేరు పెట్టలేదని టీఆర్ఎస్ కేడర్ విమర్శలు కురిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు.
ఈ వివాదంలో బీజేపీపై టీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ప్రధాని హాజరైంది ఓ ప్రైవేట్ కార్యక్రమానికి అని.. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ.. గవర్నర్ కానీ హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్రం నుంచి అధికారులు పంపిన ఉత్తర్వుల కాపీని.. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అస్వస్థత కారణంగా ప్రధానిని ఆహ్వానించలేకపోతే.. దానికి బీజేపీ నేతలు అంతగా విమర్శించాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ప్రధానిని రీసివ్ చేసుకునేందుకు ఓ పోలీసు అధికారితో పాటు ఇతరులు ఉంటే సరిపోతుందని ఆ పార్టీ వాదిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రొటోకాల్ వివరాలను సైతం సోషల్ మీడియలో పోస్టు చేసి.. బీజేపీకి కౌంటర్ ఇస్తోంది.
ఇది కూడా చదవండి : జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఆ ఎన్నికల తర్వాత ప్రకటన
ఎవరి వాదన వారిదే..
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ప్రధానిని సీఎం రిసీవ్ చేసుకోలేదని కాషాయ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై సీఎం పేరు పెట్టలేదంటూ గులాబీ దళం బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ ప్రోటోకాల్ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేక మరింత ముదురుతుందో చూడాలి. మొత్తానికి సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం కాస్త.. ఇలా వివాదానికి దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.