2024 అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల్లో కదలికలు మొదలయ్యాయి. పార్టీ తరపున టికెట్ కేటాయింపులపై దృష్టి సారిస్తారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించేదుకు ముందుకు వస్తారు. ఓటర్లను ఆకర్షితులను గావించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అన్ని పార్టీ నేతల్లో కదలికలు మొదలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ నేతలు ఎంపిక చేసుకోవడం.. వారి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఓ గ్రామ వాలంటీర్ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం ఇవ్వమని కోరుతున్నాడు. బీసీ కోటా కింద తనకు టికెట్ కేటాయించాలని వాలంటీర్ పాడి మహేష్ డిమాండ్ చేస్తున్నాడు. వైఎస్సార్సీపీ తరపున టికెట్ బీసీ వాలంటీర్లకు ఇవ్వాలని కోరుతూ కాకినాడ ప్రత్తిపాడులో ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వాలంటీర్ కోటా కింద ప్రత్తిపాడు వైఎస్సార్ సీపీ టికెట్ తనకు ఇవ్వమని సీఎంకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. దీనికోసం ఏకంగా తన అనుచరులతో రౌతులపూడి మండలం పారుపాకలో గురువారం పాడి మహేష్ ర్యాలీ నిర్వహించాడు. అతను పారుపాక గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన వాడిని అని.. తన తండ్రి గాడి నూకరాజు గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహించారన్నారు. తాను డిగ్రీ కంప్లీట్ చేశాక గ్రామ వాలంటీర్గా సేవలందిస్తున్నానని తెలిపాడు. ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు ఎనలేని గౌరవం కల్పిస్తున్నారని అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉండడంతో ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిపు సాధిస్తానని.. 2024 ఎన్నికల్లో వాలంటీర్ల కోటాలో ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపాడు.
మరోవైపు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతలు మొదలవుతున్నాయి. రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ ఆమెపట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ కు కంప్లైంట్ చేసింది. ఈ సంగతి అందరికి తెలిసిందే. తన పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని.. అధికారులకు కాల్ చేసినా అడ్డుకుంటున్నారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే తమ నేతలతో సొంతపనులు చేసుకుంటున్నారని.. ప్రారంభోత్సవాలు, ఇతర అధికారిక కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, అధికారులు తనను చులకగా చూస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రోటోకాల్ వ్యవహారంపై ఎమ్మెల్యేకు పలుమార్లు తెలియజేసినా.. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తను ఎస్టీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధి కావడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని రాజ్యలక్ష్మి ఆవేదన చెందారు.
మరోవైపు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ నుంచి తనకు, తన ఫ్యామిలీ మెంబర్స్కు ప్రాణహాని ఉందని జడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజరాజేశ్వరి ఆరోపించారు. తన కుటుంబసభ్యులు, అనుచరులపై కక్షతో కేసులు పెట్టించారని.. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై పార్టీ అధిష్టానానికి తెలియజేశానని ఆమె తెలిపారు. అంతేకాకుండా గత సంవత్సర కాలంగా తనను వేధిస్తున్నాడని బెహరా రాజేశ్వరి ఆరోపించారు. తనతో తన కుటుంబసభ్యులతో ఎవరైనా ప్రజల్లోకి వెళ్లొద్దంటూ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. కావాలనే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు.