ఏపీ సీఎం వైఎస్ జగన్ కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా గెలవాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న కుప్పంలో పర్యటించనున్న జగన్.. రూ. 66 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని నెలల క్రితం కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వీర విజయకేతనం ఎగురవేసింది. అప్పటి నుండి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు జగన్. ఈ క్రమంలో కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భుజాన వేసుకున్నారు.
అయితే టీడీపీ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని శాసిస్తున్న తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది. కుప్పం అంటే టీడీపీ, టీడీపీ అంటే కుప్పం అని అనిపించుకుంటూ వచ్చిన నియోజకవర్గం ఇప్పుడు టీడీపీ చేతుల్లోంచి జారిపోతోంది. ఊహించని విధంగా కుప్పం నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరిపోయారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు భారీగా వైసీపీలో జాయినయ్యారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మామూలుగా ఒక పార్టీ నుండి మరొక పార్టీకి నేతలు, కార్యకర్తలు జంప్ అవ్వడం అనేది సర్వ సాధారణమే. అయితే ఉన్నట్టుండి ఇలా 200 మంది ఒక్కసారిగా వైసీపీలో చేరడం టీడీపీ పార్టీకి అతి పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఒకేసారి ఇంతమంది కార్యకర్తలు టీడీపీ నుండి వెళ్లిపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ తొలిసారిగా కుప్పంలో పర్యటించనుండడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎవరూ చేయని విధంగా కుప్పంలో అభివృద్ధి పనులు చేపట్టి.. తద్వారా 2024 ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ పర్యటనకు భారీ జన సమీకరణకు, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలను, నేతలను ఆకర్షించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.
కుప్పం నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట అని అంటారు. అలాంటి కంచుకోటను ఈరోజు వైఎస్ జగన్ తన వ్యూహంతో, చతురతతో బద్దలు కొడుతున్నారని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ.. ఈసారి 175 స్థానాల్లోనూ గెలవాలన్న సంకల్పంతో వైసీపీ పని చేస్తోంది. మరోవైపు కుప్పంలో పట్టు తెచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ కుప్పం కంచు కోట పోరాటంలో గెలుపెవరిది? టీడీపీకి చెందిన కార్యకర్తలు వైసీపీలో చేరడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.