ఏపీ సీఎం జగన్ సర్కార్, చిన జీయర్ స్వామిలపై సినీ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జరగని పాపమంటూ లేదని.. మూడేళ్ల జగన్ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయని.. ప్రస్తుతం తిరుమలలో జరగని పాపమంటూ లేదని అశ్వినీదత్ మండిపడ్డారు. తిరుపతి పరపతి దిగజారిందని.. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మతమార్పిడులు జరుగుతున్నా చిన జీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని అశ్వినీదత్ ప్రశ్నించారు. ఇదే చిన జీయర్ స్వామి గతలో చంద్రబాబు నాయుడు తిరుపతిలో వెయ్యికాళ్ల మండపం తొలగిస్తే.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు ఆగమశాస్త్రం ప్రకారమే వెయి కాళ్ల మండపాన్ని తొలగించారని చెప్పుకొచ్చాడు. మరి నేడు తిరుపతిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చిన జీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిమాలయాల్లో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని.. 150 కిలోమీటర్ల స్పీడులో కారు నడిపిన వ్యక్తి… స్వామిజీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అశ్వినీ దత్.
అంతేకాక చిన జీయర్ స్వామి ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్ని కలియుగ దైవమంటూ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు అశ్వినీదత్. ఆ మాటలు వినగానే తన కడుపు మండిపోయింది అన్నారు. సమ్మక్క-సారక్క అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసమని.. పొరుగు రాష్ట్రాల ప్రజలూ సమ్మక్క-సారక్కను దేవతలుగా నమ్ముతారన్నారు. వారిని ఆయన దేవతలు కాదనడం బాధ కలిగించింది అన్నారు. ఇదే వేదిక మీదుగా.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందన్నారు అశ్వినీదత్. మరి ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.