ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే వాడీ వేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించగా.. టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రసంగం ప్రతుల్ని చించేసి విసిరారు.. తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీఏసీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ది రాజ్యాంగబద్ధమైన పదవి.. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండదన్నారు సీఎం. ఆయన్ను విమర్శించడం సరికాదని.. చర్చలో పాల్గొంటే విపక్షాలకు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం వస్తుందని.. దానిని ఉపయోగించుకోవాలన్నారు.
సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును సీఎం జగన్ తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. టీడీపీ సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రను నాశనం చేసేలా ఉందని జగన్ అన్నారు.
అయితే గతంలో కూడా ఇలాంటి పని చేశారు కదా అని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. గతంలో తాను ఇలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని.. మంత్రి మండలిని రద్దు చేసుకుంటానని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాను అన్నది మీరు చేశారని కాదని.. గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అనేకసార్లు జరిగిందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు.
బీఏసీ సమావేశం తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లు క్షేత్రస్థాయిలోనే ఎమ్మెల్యేలు ఉండాలన్నారు. ఎమ్మెల్యేలతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం జగన్ చేసిన సవాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.