ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. సంవత్సరానికి పైగా జరుగుతోన్న ఈ నిరసనల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు రైతులు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించారు. రైతుల నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. తుళ్లూరులో వంటా వార్పు చేపట్టారు. రాజధానిపై దొంగ కమిటీలు వద్దంటూ రైతులు నినాదాలు చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం ప్రకటన చేసేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు రైతులు. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ తాడికొండ రైతులు ఆందోళన చేపట్టారు.
పొన్నెకల్లు తాడికొండ కూడలికి చేరుకున్న రైతులు ధర్నా చేశారు. రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు ఇవాళ్టికి 500వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. మరోవైపు విశాఖ ఉక్కు సాధిస్తామని అమరావతి రైతులు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు,మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.