కొవిడ్ రోగులు, వారి కుటుంబ సభ్యులు ఒకే టాయిలెట్ వినియోగించడం మంచిది కాదు. ఒక వేళ తప్పదు అనుకుంటే ఆ టాయిలెట్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరి. దీంతో పాటు ఫ్లష్ చేసే ముందు టాయిలెట్ సీట్ను మూసివేయాలి. టాయిలెట్ సీట్పై వైరస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించే ముందు తప్పకుండా శుభ్రంచేయాలి. అంతేకాదు కొవిడ్ రోగి టాయిలెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని క్లీన్ చేసేందుకు డిసిన్ఫెక్టెంట్లను ఉపయోగించాలి. ఫ్లషింగ్ టాయిలెట్ వినియోగించి నీటిని వదిలినప్పుడు ఆ బౌల్లోపల బలమైన ప్రవాహం వల్ల పెద్ద ఎత్తున తుంపరలు చెలరేగుతాయి. కంటికి కనిపించనంత పరిమాణంలో టాయిలెట్ బౌల్ నుంచి వచ్చే ఈ తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందా అన్న కోణంలో ఈ పరిశోధన సాగింది. ఫ్లషింగ్ చేస్తున్నప్పుడు టాయిలెట్ బౌల్ నుంచి సెకనుకు 5 మీటర్ల వేగంతో నీటి తుంపరలు పైకి లేస్తాయి. విడుదలైన మొత్తం తుంపర్లలో 40-60 శాతం టాయిలెట్ సీట్ కంటే పైకి వెళ్లి విస్తృతంగా వ్యాపిస్తాయి. అంటే నేల నుంచి 106 సెంటీమీటర్లకు మించి పైకి వెళతాయి. ఇలా విస్తరించిన కణాలు ఫ్లషింగ్ తర్వాత 30-70 సెకన్ల తర్వాత కూడా తేలియాడుతూనే ఉంటాయని తేలింది. ఇదే ఇప్పుడు అందోళన కలిగిస్తోంది.
దీనికి తోడు మల-నోటి సంక్రమణ స్వభావాన్ని బట్టి ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు టాయిలెట్ వినియోగించినప్పుడు పెద్ద సంఖ్యలో వైరస్లు టాయిలెట్ బౌల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్లను ఇన్ఫెక్షన్ కేంద్రాలుగా భావిస్తున్నారు. సరైన విధంగా టాయిలెట్స్ ఉపయోగించకపోతే వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున దయచేసి జాగ్రత్త వహించండి. ‘‘కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తులు సాధారణంగా హోం ఐసొలేషన్లో ఉంటారు. వాళ్లు షేరింగ్ బాత్రూం ఉపయోగించడం అనివార్యం. ఇక పబ్లిక్ టాయిలెట్లలో అయితే చాలామంది వచ్చివెళ్తుంటారు. కాబట్టి కరోనా సోకిన వ్యక్తి ద్వారా అనేక మందికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. ఈ కారణాల దృష్ట్యా కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మరుగుదొడ్లను జాగ్రత్తగా పరిశీలించడం అత్యవసరం’ అని సదరు పరిశోధన పేర్కొంది.