చైనాకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్ ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ నిర్ణయించింది. అయితే, ఆ ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలించాలని రీసెంట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. 1996లో నోయిడాలో శాంసంగ్ తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ గెలాక్సీ ఎస్9, ఎస్9+, గెలాక్సీ నోట్8 వంటి ఫోన్లను తయారు చేస్తుంది. శాంసంగ్కి భారత్లో చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్లో మరో ప్లాంటు ఉండగా అయిదు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, ఒక డిజైన్ సెంటర్ ఉన్నాయి.
ప్రస్తుతం భారత్లో 120 మొబైల్ ఫోన్స్ తయారీ ఫ్యాక్టరీలు ఉండగా 40 కోట్ల పైగా స్మార్ట్ఫోన్స్ వినియోగంలో ఉన్నాయి. 32 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఏటా 6.8 కోట్లుగా ఉన్న శాంసంగ్ హ్యాండ్సెట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దశలవారీగా 2020 నాటికి 12 కోట్లకు పెంచాలనీ, కొత్తగా 2,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇక్కడ తయారయ్యే స్మార్ట్ఫోన్స్ ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి అవుతాయని శాంసంగ్ ఇండియా సీఈవో హెచ్సీ హాంగ్ తెలిపారు.
మెరుగైన పారిశ్రామిక విధానం, పెట్టుబడిదారులతో స్నేహపూర్వక విధానాల కారణంగా నోయిడాలో తమ ప్లాంటును పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు శాంసంగ్ కు సీఎం యోగి పూర్తి భరోసాను కల్పించారు. భవిష్యత్తులో కూడా శాంసంగ్ కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.