ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు అనేకం తెరమీదకు వచ్చాయి. వాటిలో తొలుత బయటకు వచ్చిన లవ్ స్టోరీ సీమా హైదర్-సచిన్. పాకిస్తాన్ మహిళ అయిన సీమా హైదర్కు పబ్జీ ద్వారా పరిచయమయ్యాడు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు అనేకం తెరమీదకు వచ్చాయి. వాటిలో తొలుత బయటకు వచ్చిన లవ్ స్టోరీ సీమా హైదర్-సచిన్. పాకిస్తాన్ మహిళ అయిన సీమా హైదర్కు పబ్జీ ద్వారా పరిచయమయ్యాడు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. అనంతరం రహస్యంగా కలుసుకునేలా చేసింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా.. భర్తను కాదని సచిన్ను వదిలి ఉండలేక నేపాల్ మీదుగా యుపి వచ్చింది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సచిన్ తల్లిదండ్రులు కూడా ఆమెను కోడలిగా స్వీకరించడంతో అంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పొక్కి.. పోలీసుల చెంతకు చేరింది. సీమాను అక్రమంగా ఇంట్లో పెట్టుకున్నందుకు సచిన్, అతడి తండ్రిని అరెస్టు కూడా చేశారు. అయితే వారు బెయిల్ పై విడుదలయ్యారు.
ఆ తర్వాత భర్త కూడా ఆమెపై పలు ఆరోపణలు చేశారు. ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అని, వారి బంధువులు పాక్ ఆర్మీలో పని చేస్తున్నారన్న ఆరోపణలు చేయడంతో పోలీసులు సీమాను విచారించారు. అయితే తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను ఇక్కడి నుండి వెళ్లేది లేదని తెగేసి చెప్పింది. ఈ మొత్తం పరిణామాలతో సీమా-సచిన్ ప్రేమ కథ దేశం మొత్తం ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పుడు సీమా జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ అమిత్ జానీ. పబ్జీతో మొదలైన పరిచయం నుండి ప్రియుడి కోసం స్వదేశాన్ని విడిచి రావడం, ఆపై ఆమెపై పాక్ ఏజెంట్ అన్న ముద్ర ఈ కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.
జానీ ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ‘కరాచీ టు నోయిడా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమె జీవితం మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆమె మాజీ భర్త గులాం హైదర్ను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. నటీనటుల ఎంపిక మరో రెండు రోజుల్లో పూర్తి చేసి.. చిత్రీకరణ మొదలు పెడతారు. మరో వైపు సీమా కూడా ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఉదయ్పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య ఘటనపై ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’ పేరిట ఓ చిత్రాన్ని జానీ ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ త్వరలో తెరకెక్కించనుంది. ఈ సినిమాలో ‘రా’ ఏజెంట్ పాత్ర కోసం సీమాకు ఆడిషన్ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.