డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ – ఓటీటీకీ ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది జనంలో. కరోనా కారణంగా సినిమా హాళ్ల మూసివేత, షూటింగ్ల నిలిపివేతతో ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. తెలుగు బాషలో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ఒక్కటే ఉంది. గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాల్లో తిరుగులేని సక్సెస్ రుచి చూసారు అరవింద్. తెలుగు ప్రపంచంలో ఓటీటీ తీసుకొచ్చినా అది అంతగా ప్రజల్లోకి వెళ్లటానికి మరింతగా తీర్చి దిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పత్రికా, టీవీ, డిజిటల్ మీడియాలో ప్రత్యేక స్థానం ఉన్న రామోజీ గ్రూపు ఓటీటీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
బుల్లితెర రంగంలో తిరుగులేని ప్రస్థానం ఈటీవీ సొంతం. తెలుగులో ఉన్న ఓటీటీకి పోటీగా దీనిని తీసుకురావాలని మరి కొంత మంది ఈ రంగంలోకి ప్రవేశించే ముందే తన స్థానం సుస్థిరం చేసుకోవాలనేది రామోజీ గ్రూపు ఆలోచన గా సమాచారం. దాదాపు రెండు వందల కోట్ల మేర పెట్టుబడిగా నిర్ణయంచినట్లు తెలుస్తోంది. ఇక, క్రియేటివిటీ ఉన్న వారి కోసం ప్రస్తుతం రామోజీ గ్రూపు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
నిత్యం కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులను నిలబెట్టుకోవాలంటే వెబ్ సిరీస్ లు ప్రత్యేక షో లు సినిమాలు ఆసక్తి కర ఇంటర్వ్యూలు ఫేమస్ పర్సనాలిటీలను డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తేనే ప్రస్తుత పోటీలో నిలబడగలుగుతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు పోటీగా రామోజీ గ్రూపు ఓటీటీ ప్రారంభిస్తే ఖచ్చితంగా అది ఆహా కు గట్టి పోటీ ఇవ్వటం ఖాయమనే వాదన ఉంది.
రెండు ఓటీటీలు పోటీ పడి మంచి కంటెంట్ అందిస్తే మంచి ఆనందాన్ని పంచుతాయి. మరి ఆ రెండూ తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గర అవుతాయో ఏ మేరకు అభిమానం సంపాదిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.