చిరంజీవి అంటే అల్లు అరవింద్ కి ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అభిమానులు ఆయన సినిమాలు చూసి పెరిగితే.. అల్లు అరవింద్ చిరంజీవితో సినిమాలు చేసి పెరిగారు. అలాంటి చిరంజీవి కోసం పన్నెండేళ్ళు పోరాడారు అని చెప్పుకొచ్చారు. ఏ విషయంలో పోరాడారు? ఏంటి ఆ కథ?
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘బోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో భాగంగా ‘బోళా శంకర్’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న భారీ ఎత్తున నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్ కి చిరంజీవి, మెహర్ రమేష్, కీర్తి సురేష్, అల్లు అరవింద్, యంగ్ డైరెక్టర్లు బాబీ, సంపత్ నంది, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వంశీ పైడిపల్లి వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ ఈవెంట్ కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “బోళా శంకర్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు చూడని సక్సెస్ లేదు.. ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఏముంది. మీరంతా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను చేస్తూ పెరిగాను. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 12 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు చేసిన సేవల గురించి ఒకరు నీచంగా మాట్లాడారని.. 12 సంవత్సరాలు పోరాడి వాళ్ళని జైలుకు వెళ్లే వరకు ఊరుకోలేదు. అదీ చిరంజీవి మీద నాకున్న అభిమానం’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ జీవిత రాజశేఖర్ మీద చేశారని స్పష్టమవుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఆ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా కింద కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ దాదాపు 12 సంవత్సరాల పాటు జరిగింది. జీవిత రాజశేఖర్ దంపతులు ఎలాంటి ఆధారాలు చూపకలేకపోవడంతో వారిద్దరికీ కోర్టు సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ గుర్తు చేస్తూ మాట్లాడారు. ఇక భోళా శంకర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మొదటి వారం రోజులు ఫ్యాన్స్తో హౌస్ ఫుల్ కావడం కాయంగా కనిపిస్తుంది. ఆ విధంగా చూసుకుంటే మొదటి వారం కలెక్షన్స్ భారీగానే రాబట్టే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. మరి విడుదల తర్వాత ఎన్ని రికార్డ్స్ తిరగరాస్తుందో తెలియాలంటే ఆగస్టు 11 వరకు వేచి చూడాల్సిందే. మరి అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.