స్పోర్స్ట్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో ఇండియా ఒడిపోవడం అందరిని బాధించింది. టీ-20 ప్రపంచ కప్ లో భాగంగా దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచింది.ఈ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత టీం ఇండియా పేసర్ మహమ్మద్ షమీపై ఆన్ లైన్ లో దాడి ప్రారంభమైంది.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమీ బౌలింగ్ దారుణంగా ఉందని, అతడిచ్చిన పరుగుల వల్లే భారత జట్టు ఓటమి పాలైందని క్రికెట్ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే కాదు భారత జట్టులోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడని, షమీ వెంటనే ఆ దేశానికి వెళ్లిపోవాలంటూ సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మహమ్మద్ షమీపై ట్రోలింగ్స్ ను ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఖండించారు. చాలా మంది షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా షమీకి మద్దతు ప్రకటించారు. మేమంతా నీతోనే ఉన్నామంటూ షమీకి భరోసా కల్పించారు.
ఈమేరకు రాహూల్ గాంధీ ట్విట్టర్ లో సోమవారం పోస్ట్ పెట్టారు. మహ్మద్ షమీ.. మేమంతా నీతోనే ఉన్నాము.. వాళ్లంతా విధ్వేషంతో నిండిపోయి ఉన్నారు.. ప్రేమ అనేది తెలియదు.. వాళ్లని క్షమించు.. అంటూ రాహూల్ గాంధీ ట్వీట్ చేశారు. అన్నట్లు రాహూల్ కామెంట్ చేసింది పరోక్షంగా బీజేపీ పార్టీ నాయకులనే అని వేరే చెప్పక్కర్లేదు.
Mohammad #Shami we are all with you.
These people are filled with hate because nobody gives them any love. Forgive them.
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2021