కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుండటం, వ్యాక్సిన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం, దీంతో పంపిన టీకాలు వృధా అయిపోవడం, ఒక్కటంటే ఒక్క డోసూ అందని చాలా పేద దేశాలున్నాయి. ఇలాంటి టైంలో 6 కోట్ల డోసులు చెత్త బుట్టలోకే పోతే! జాన్సన్ అండ్ జాన్సన్ కు అలాంటి పరిస్థితే వచ్చింది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బాల్టిమోర్ ఫ్యాక్టరీలో తయారు చేసిన కోట్ల డోసుల వ్యాక్సిన్లకు యూఎస్ ఎఫ్ డీఏ ఎర్ర జెండా ఊపింది. వ్యాక్సిన్లను టెస్ట్ చేసిన ఎఫ్ డీఏ లోపాలున్నాయని చెప్పి 6 కోట్ల డోసులకు నో చెప్పింది. వాటన్నింటినీ చెత్త బుట్టలో పారేయాలంటూ జాన్సన్ అండ్ జాన్సన్ కు ఆదేశాలిచ్చినట్టు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మిగతా బ్యాచ్ లలోని కోటి డోసులకు మాత్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీనిపై ఎఫ్ డీఏ స్పందించింది. రెండు బ్యాచుల వ్యాక్సిన్లను వాడుకునేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. కొన్ని బ్యాచ్ లలోని టీకాలు వినియోగానికి పనికిరావని పేర్కొంది. అయితే, డోసుల లెక్కలను మాత్రం వెల్లడించలేదు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు బాల్టిమోర్ లోని ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ ఐఎన్సీకి ఇంకా అనుమతులను ఇవ్వలేదని తెలిపింది.
గత ఏప్రిల్ లోనే అక్కడ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ను అమెరికా అధికారులు నిలిపేశారు. అయితే, అమెరికా కాదన్న ఆ డోసులను విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా కోసమే జాన్సన్ అండ్ జాన్సన్ ప్రత్యేకంగా తయారు చేసిన 2.1 కోట్ల డోసులు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో కెనడాలోనూ 3 లక్షల డోసులను తిరస్కరించారు. ఒకపక్క వ్యాక్సిన్స్ దొరక్క, ఇంకోపక్క కాలం చెల్లాయని పక్కన పడేయడం అత్యంత విషాదం