రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే మనం తీసుకునే ఆహారపదార్ధాల్లో అవి ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కరోనా భయంతో భారతీయుల్లో విటమిన్ టాబ్లెట్లు, ఇమ్యూనిటీ బూస్టర్ల వ్యాపారం ఓ రేంజ్ లో పెరిగింది. కరోనా చికిత్సలో భాగంగా వైద్యులు కూడా విటమిన్ ట్యాబ్లెట్లను సూచించడంతో వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా చాలామంది వాటిని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వ్యాపారంలో వృద్ధి చోటుచేసుకుంది.
ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదని కరోనా గుణపాఠం నేర్పింది. దీంతో సగటు భారతీయిడి ఆలోచనా విధానం కూడా మారింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు విటమిన్ సప్లిమెంట్లపై ఆధారపడటం మొదలు పెట్టాడు. అలా ఏడాదిలో ఏకంగా 15వేల కోట్ల రూపాయల హెల్త్ సప్లిమెంట్లను తీసుకున్నారు భారతీయులు. భారత్ లో విటమిన్ సప్లిమెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్ల మార్కెట్ 2019లో 5వేల కోట్ల రూపాయలుగా ఉంటే 2020లో అది ఏకంగా 15 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది.
ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక జనం తమ ఆహారం ద్వారా తగినంత మోదాదులో విటమిన్ సి పొందుతున్నారని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. విటమిన్ సిని అధిక మొతాదుల్లో తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.