ఎవరికైనా డబ్బు కలిసొచ్చినా.. మంచి జరిగినా నీ పంట పండింది అంటారు. అయితే అందరి కడుపు నింపే మెజారిటీ రైతుల పంట మాత్రం ఎప్పుడూ పండింది లేదు. కానీ ప్రస్తుతం చాలా మంది రైతులు లాభాల బాట పడుతున్నారు. దీంతో రైతుల పంట కూడా పండుతుంది.
పంట పండితే సరిపోదు.. రైతు పంట కూడా పండాలి. అప్పుడే ఆ రైతు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పంట పండితే కేవలం జనం కడుపు నిండుతుందేమో కానీ రైతు పంట పండితే ఆ కుటుంబంలో అందరి కడుపు నిండుతుంది. అయితే ఇన్నేళ్ళలో రైతులు ఏరోజూ గొప్పగా లాభపడింది లేదు. రైతు ముఖంలో ఆనందం కనబడింది లేదు. కానీ మొదటిసారిగా రైతు ముఖంలో ఆనందం కనబడుతుంది. గత కొన్ని రోజుల నుంచి రైతులు లాభాల బాట పట్టారు. భారీ లాభాలను పొందుతూ లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతున్నారు. ఒకే ఒక్క పంట రైతుల జీవితాన్ని మార్చేసింది. ఒక్క పంటతో వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. దానికి కారణం టమాటా. టమాటాలే కదా అని తీసిపడేయడానికి లేదు.
ఎందుకంటే ఇప్పుడు ఇవే ప్రజల పాలిట ఉల్లిపాయలుగా మారాయి. కొనాలంటే కన్నీళ్లు పెట్టే పరిస్థితి. కానీ ఇన్నాళ్లు రైతులు కన్నీళ్లు పెట్టినా పట్టించుకోని మనుషులు ఇవాళ ఏడుస్తున్నప్పటికీ ఆ ఫలితంగా రైతులు బాగుపడుతున్నందుకు సంతోషించాలి. నిజానికి టమాటాలు పెరిగిపోవడానికి రైతులు కాదు కారణం. డిమాండ్ కి తగ్గట్టు సప్లై చేసేంత టమాటాలు లేవు. రైతులు ఎక్కువగా వేరే పంటలు వేయడం, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సరిగా పండకపోవడం వంటి కారణాల వల్ల రేటు పెరిగిపోయింది. రేటు పెరిగిపోవడంతో రైతులు భారీగా లాభపడుతున్నారు. ఇటీవల కాలంలో టమాటాలు అమ్మి భారీగా లాభపడ్డారు. ఏపీకి చెందిన టమాటా రైతు 45 రోజుల్లో 4 కోట్లు అమ్మి కోటీశ్వరుడు అయ్యారు.
ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా టమాటా రైతులు లక్షలు ఆదాయం పొందారు. తాజాగా మరొక రైతు ఒక్కరోజులో రూ. 1.49 లక్షలు సంపాదించారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకి చెందిన ఓ రైతు ఒకే రోజులో లక్షాధికారి అయ్యారు. తిరుప్పూర్ బస్టాండ్ సమీపంలో ఉన్న మార్కెట్ లో కిలో టమాటా ధర రూ. 115 పలికింది. సేవూరు సమీపంలోని వేలయన్ కాడుతోట ప్రాంతానికి చెందిన తిరుమూర్తి అనే రైతు తన పొలంలో పండించిన టమాటాలను తిరుప్పూర్ బస్టాండ్ సమీపంలో ఉన్న మార్కెట్లో విక్రయించగా ఒక్క రోజులో రూ. లక్ష 49 వేలు సంపాదించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఎకరం పొలంలో 5,500 టమాటా మొక్కలు సాగు చేశానని.. మూడు నెలల్లో రూ. 60 వేలు పెట్టుబడి పెట్టానని.. మంచి ఆదాయం రావడం సంతోషంగా ఉందని అన్నారు. మరి రైతు పంట పండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.