బ్యాంకులు చేసే నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యులకు ఓ పదివేలు అప్పు ఇవ్వమంటే.. లక్ష సందేహాలు వ్యక్తం చేసే బ్యాంకులు.. వందల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ వంటి వారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే కిక్కురుమనని బ్యాంకులు సాధారణ వ్యక్తులు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడంటే ఇంటికి వెళ్లి తాళం వేస్తుంటాయి. అయితే,.. బ్యాంకులు ఇంతకన్నా క్రూరంగా వ్యహరిస్తాయని గుజరాత్లో వెలుగు చూసిన ఒక సంఘటన తెలుసుకుంటే అర్థం అవుతుంది. కేవలం 31 పైసల బాకీ ఉన్నాడని ఒక రైతును కోర్టుకు లాగింది. ఇదంతా చేసింది.. ఏదో చిన్న బ్యాంక్ అనుకుంటే పొరపాటు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా పేరు తెచ్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సమీపంలోని ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ అనే వ్యక్తి, 2020లో షంజీభాయ్ అనే రైతుకు తన భూమిని విక్రయించాడు.. అయితే.. గతంలో ఈ భూమిపై ఎస్బీఐ బ్యాంకు నుంచి శ్యాంజీ మూడు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ మాదిరిగా ఎగ్గొట్టకుండా తిరిగి చెల్లించాడు. అప్పు తీరిపోయిందనుకొని భూమిని అమ్మేశాడు. అయితే.. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగలేదు. కారణం బ్యాంకు నుంచి అప్పుకు సంబంధించిన నో డ్యూ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై వాళ్లు కోర్టును ఆశ్రయించగా బ్యాంకు కూడా కోర్టులో దావా వేసింది.
ఇది కూడా చదవండి: SBI కస్టమర్లకు హెచ్చరిక.. ఈ నెంబర్స్ నుండి వచ్చే లింక్లను ఓపెన్ చేయొద్దు!
ఈ ఘటనలో బ్యాంకు తరపు న్యాయవాది ఆశ్చర్యపోయే విషయం వెల్లడించారు. శ్యాంజీ బ్యాంకుకు 31 పైసలు బాకీ ఉన్నాడని.. అందుకే సర్టిఫికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇది చెల్లిస్తే.. ఇస్తామని చెప్పాడు. వాస్తవానికి 50 పైసల కంటే తక్కువ బాకీ ఉంటే లెక్కలోకి రాదు. ఇక, బ్యాంకు వారి వాదనలు విన్న న్యాయమూర్తికి చిర్రెత్తుకొచ్చింది. బ్యాంకుకు చీవాట్లు పెట్టి రైతు శ్యాంజీకి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు.. రైతును కోర్టుకు లాగినందుకు.. కోర్టు ఖర్చుల కింద 25 వేలు ఇవ్వాలని.. దీనిని 12 శాతం వడ్డీతో.. నెలలోగా చెల్లించాలని.. ఆదేశించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘వేల కోట్లు ఎగ్గొట్టినోళ్లను వదిలేసి.. ఇలా 31 పైసల కోసం కోర్టుదాకా వెళ్లడం చాలా గ్రేట్’ అంటూ బ్యాంకు అధికారులను పొగుడుతున్నారు. ఈ గాహ్టనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.