ప్రతి ఏటా కేరళలో రామాయణ మాస సంబరాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయాల్లో, ఇళ్ళలో రామాయణ గ్రంథాన్ని పఠిచడం అక్కడ ఆనవాయితీ. అయితే అక్కడ రామాయణాన్ని పఠించేది కేవలం హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా. అవును ఉత్తర కేరళ జిల్లాకి చెందిన ఇద్దరు ముస్లిం యువకులు రామాయణాన్ని చదువుతారు. కేవలం ఒక్కరోజో, ఒక్క నెలో కాదు నిత్యం రామాయణ పఠనం చేస్తారు. మొహమ్మద్ జబీర్ పీకే, మొహమ్మద్ బాసిత్.. వీరిద్దరూ వాలంచేరిలో ఉన్న కెకెఎస్ఎమ్ ఇస్లామిక్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ కాలేజ్లో 8 ఏళ్ల పాటు ఉండే వాఫీ ప్రోగ్రామ్ కోర్సులో జబీర్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, బాసిత్ 5వ సంవత్సరం చదువుతున్నాడు.
రామాయణ మాసం వేడుకల్లో భాగంగా జూలై 23 నుంచి 25 వరకూ డీసీ బుక్స్ నిర్వహించిన రామాయణ క్విజ్లో జబీర్, బాసిత్, అభిరామ్, గీతు కృష్ణన్, నవనీత్ గోపన్ విజేతలుగా నిలిచారు. వీరిలో జబీర్, బాసిత్ ఇద్దరు ముస్లింలు కావడం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఈ ఇద్దరూ విజేతలుగా నిలవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు అభినందనలు తెలియజేస్తున్నారని, వీరు ఇలా విజేతలుగా నిలవడంలో కాలేజీ ప్రిన్సిపాల్ అబ్దుల్ హకీమ్ ఫైజీ పాత్ర ఎంతగానో ఉందని, ఆయనే తమని ప్రోత్సహించారని యువకులు అన్నారు.
రామాయణ క్విజ్లో విజేతలుగా నిలిచిన సంఘటన తమని రామాయణాన్ని లోతుగా చదివేంతగా ప్రేరేపించిందని అన్నారు. కర్మభూమి అయిన భారత దేశానికి చెందిన రాయమణం, మహాభారత గ్రంథాలను భారతీయులందరూ తప్పకుండా చదవాలని అన్నారు. అవి మన సంస్కృతిలో భాగమని జబీర్ అన్నారు. జబీర్ 2015లో వాఫీ క్యాంపస్లో జాయినయ్యారు.
అన్ని మతాలు శాంతిని ప్రభోధిస్తాయని, ప్రజల సంక్షేమమే కోరుకుంటాయని అన్నారు. రామాయణ కథ విషయానికొస్తే.. రాముని గురించి చెబుతుందని, రాముడెంత ధర్మ స్వరూపుడో అర్ధమవుతుందని అన్నారు. రాజు అంటే ఎలా ఉండాలో, ప్రజలను ఎలా ప్రేమించాలో, ఎలా పాలించాలో చూసి నేర్చుకోవచ్చని అన్నారు. సహనం, శాంతి, సోదర ప్రేమ వంటి అనేక సద్గుణాలను రాముడి నుంచి నేర్చుకోవచ్చని అన్నారు. రాముడు ఆచరించినవి భారతదేశంలో ఆచరిస్తే.. హింస, ఉగ్రవాదానికి చోటు ఉండదని అన్నారు.
ఇక బాసిత్ అయితే తన చిన్ననాటి నుంచి రామాయణం పట్ల ఆకర్శితుడయ్యానని అన్నారు. చిన్నతనం నుండి రామయణానికి సంబంధించిన కామిక్ పుస్తకాలు చదివేవాడినని అన్నారు. ఎప్పుడైతే ఈ క్యాంపస్కి వచ్చానో అప్పటి నుండి మిగతా మత గ్రంథాల పట్ల ఆకర్శితుడినయ్యానని అన్నారు. ఈ కాలేజీలో సిలబస్లో హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం మీద సబ్జెక్టులు ఉంటాయని.. క్రైస్తవం, జుడాయిజం మరియు టావోయిజం మత గ్రంథాలను కూడా నేర్చుకుంటున్నామని అన్నారు. 97 సిఐసి ఆధ్వర్యంలో నడిచే 97 క్యాంపస్లలో ఈ వాఫీ కోర్సును అందిస్తున్నారు. మరి రామాయణం పట్ల ఇంత ఆకర్శితులైన ఈ ముస్లిం యువకులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.