కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్టార్ హోటళ్లతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. కొన్ని ఆస్పత్రులు కొన్ని హోటల్స్తో డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. హోటల్స్కి వచ్చే అతిథులకు రహస్యంగా వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం అని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రకారం ఇలా చేయడానికి వీలు లేదంటూ నోటీస్ జారీ చేసింది. కేవలం నాలుగుచోట్ల మాత్రమే టీకాల కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అందుకు అతీతంగా ఎక్కడా చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించే ప్రైవేటు కొవిడ్ టీకా సెంటర్., ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే వర్క్ ప్లేస్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ భవనాలు, స్కూళ్లు, కాలేజీలు, వృద్ధాశ్రమాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కేంద్రాలు వ్యాక్సిన్ వేయాల్సిన ప్రదేశాలు ఈ నాలుగు చోట్ల తప్ప మిగతా ఎక్కడా అందించడానికి వీల్లేదని పేర్కొన్నారు. స్టార్ హోటళ్లలో వ్యాక్సిన్ అందించడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి తక్షణం ఆ కార్యక్రమాన్ని ఆపేయాలని ఆదేశించారు. అలాంటి సంస్థలపై తక్షణం పరిపాలన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.