రైతుకి భూమే ఆస్తి. ఉంటే గింటే సొంతంగా ఒక ఇల్లు ఉంటుందేమో. ఎవరైనా తమ ఆస్తులను కాపాడుకుంటారు. ఎందుకంటే ఆ ఆస్తులు ఉంటేనే ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు. లేదంటే విలువే ఇవ్వడం లేదు. అయితే ఒక రైతు మాత్రం తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్ కి రాసిచ్చేసి తాను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు. తన భూమిలో ఒక పాఠశాల గానీ ఆసుపత్రి గానీ కట్టించమని చెప్పి కోరాడు. ఇంతకు ఎవరా శ్రీమంతుడు?
ఓ రైతు కోటిన్నర విలువ చేసే ఆస్తిని గవర్నర్ కి రాసిచ్చేశాడు. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వారికి కూడా ఆస్తి రాసివ్వకుండా మొత్తం గవర్నర్ కే రాసిచ్చేసాడు. ఎందుకో తెలియాలంటే అతని కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని బిరాల్ గ్రామానికి చెందిన నాథు సింగ్ (80) అనే రైతుకి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నాథు సింగ్ భార్య కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో కన్ను మూసింది. దీంతో నాథు సింగ్ కొడుకుతోనే ఉంటున్నాడు. అయితే కొడుకు, కోడలు తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కలత చెందిన నాథు సింగ్.. తన ఆస్తికి వారసులుగా పిల్లలు అనర్హులు అని భావించాడు.
ఇక అనుకున్నదే తడవుగా తన కోటిన్నర విలువ చేసే స్థిరాస్తులను గవర్నర్ పేరున బదిలీ చేయాలని అనుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన భూమిలో పాఠశాల లేదా ఆసుపత్రిని నిర్మించాలని కోరుతూ యూపీ గవర్నర్ కి అఫిడవిట్ దాఖలు చేశాడు. ప్రస్తుతం నాథు సింగ్ వృద్ధాశ్రమంలోనే ఉంటున్నాడు. ఈ వయసులో తాను తన కొడుకు, కోడలితో ఉండాలి కానీ వారు సరిగా చూసుకోవడం లేదని అన్నాడు. అందుకే ఆస్తిని వారికి చెందకుండా గవర్నర్ కి చెందాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో నాథు సింగ్ చాలా మొండిగా ఉన్నారని.. మొదట ఏదైనా అనుకున్నారో అదే మొండి వైఖరి కలిగి ఉన్నారని వృద్ధాశ్రమం ఇంఛార్జి రేఖా సింగ్ వెల్లడించారు.
తాను చనిపోతే తన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు రావడం కూడా తనకు ఇష్టం లేదని ఆయన చెప్పినట్లు ఆమె తెలిపారు. రైతు అభ్యర్ధన మేరకు ఆ ఆస్తిని గవర్నర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశామని స్థానిక సబ్ రిజిస్ట్రార్ అధికారి పంకజ్ జైన్ అన్నారు. నాథు సింగ్ నివాస గృహం, కోటిన్నర విలువైన స్థిరాస్తులను, 10 బిగాల వ్యవసాయ భూమి అంటే మూడు ఎకరాలకు పైనే ఉన్న భూమిని అఫిడవిట్ లో వెల్లడించారు. ఆయన మరణానంతరం ఇది అమల్లోకి వస్తుందని అన్నారు. అదండీ విషయం. మరి కొడుకు, కోడలు తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో తన ఆస్తిని గవర్నర్ పేరు మీద బదిలీ చేసి తాను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయిన తండ్రిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.