‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపం. ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు. బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తల్లకిందులవుతున్న పేద, మధ్యతరగతి వర్గాల వారికి ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ దారి చూపుతోంది. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే చాలు.. బాధితులకు వైద్య ఖర్చుల కోసం ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ విధానంలో దేశ, విదేశాల నుంచి విరాళాల సమీకరణకు మిలాప్, కెట్టో, ఇంపాక్ట్గురు వంటి సంస్థలు సేవలందిస్తున్నాయి.
చికిత్సకు అవసరమైన డబ్బును వెచ్చించే పరిస్థితి లేదా స్తోమత బాధితులకు లేనప్పుడు వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఎవరైనా సరే నిధుల సమీకరణ చేపట్టొచ్చు. మిలాప్, కెట్టో, ఇంపాక్ట్గురు తదితర సంస్థల వెబ్సైట్ల్లోకి వెళ్లి బాధితుడి పేరు, చిత్రాలు, ఆరోగ్య సమస్య, చికిత్సకు సంబంధించిన పత్రాలు, వైద్యుల నివేదికలు వంటివి పొందుపరచాలి. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో, విరాళాల రూపంలో ఎంత అవసరమో చెప్పాలి. బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివరాలివ్వాలి. నిధులు సమీకరిస్తున్న వారి పేరు, వివరాలతో ఓ పోస్టును రూపొందించి ఆయా సంస్థలు వారి వెబ్సైట్లో ఉంచుతాయి. తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ విస్తృత ప్రచారం కల్పిస్తాయి. ఆ పోసు లింక్నూ బాధితుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పరిచయస్తులు షేర్ చేయొచ్చు. వైద్యఖర్చులకు అవసరమైన నిధిలో ఎంత పోగయ్యిందో దాతలకూ కనిపిస్తుంది. బాధితులు ఒకేసారి మొత్తం నిధిని తీసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు మెడికల్ బిల్లుల్ని వెబ్సైట్లో పొందుపరిచి వారికి సమకూరిన నిధి నుంచి డ్రా చేసుకోవచ్చు.