విమాన ప్రయాణాల్లో ఒక్కోసారి మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. తాజాగా ఓ ఇండిగో విమానంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఖతార్లోని దోహాకు బయల్దేరిన ఓ ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ పాకిస్థాన్లోని కరాచీ ఎయిర్పోర్ట్కు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించారు. వైద్య కారణాల రీత్యా అత్యవసరంగా దిగేందుకు అనుమతి కోరారు. వాళ్లు పర్మిషన్ ఇవ్వడంతో విమానాన్ని వెంటనే దారిమళ్లించి కరాచీ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. అయితే ఎయిర్పోర్టు మెడికల్ టీమ్ ఆ ప్రయాణికుడ్ని పరీక్షించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వెల్లడించారు.
కరాచీ ఎయిర్పోర్టు మెడికల్ టీమ్ పరీక్షించే సమయానికి ఆ ప్రయాణికుడు చనిపోయాడు. దీంతో అతడికి డెత్ సర్టిఫికేట్ను అందించారు. ఆ ప్రయాణికుడి మృతదేహంతో సహా విమానం తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ ఘటన మీద ఇండిగో సంస్థ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది ఇండిగో. విమానంలోని ఇతర ప్రయాణికులను దోహాకు పంపించేందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. ఇండిగో విమానంలో చనిపోయిన వ్యక్తిని నైజీరియాకు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లాగా గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.