నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోనియా గాంధీని ఈడీ విచారించటం సహా.. ధరల పెరుగుదల, జీఎస్టీ అంశాలపై ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆందోళనకు దిగింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీని చుట్టుముట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రంజీత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మానికం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్గర్హి, కే సురేశ్లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రాహుల్ గాంధీని పోలీసులు చుట్టుముట్టిన క్రమంలో సుమారు 30 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అనంతరం రాహుల్ గాంధీని ఎత్తుకెళ్లి బస్సు ఎక్కించారు. అప్పటికే ఆయనతో ఉన్న పలువురు ఎంపీలను బస్సు ఎక్కించారు. ‘పోలీసుల సూచనల మేరకే నిరసనల్లో పాల్గొన్నాం. విపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టటం, మా గొంతులను నొక్కేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు చేస్తున్న కుట్ర. దానికి మేము భయపడం. మా పోరాటం కొనసాగుతుంది. ’ అని తెలిపారు కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.