వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్దేశించకున్న సమయం కంటే ముందే బైడెన్ తన లక్ష్యాలను సాధించారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది 18ఏళ్ల యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన బైడెన్.. యువతను ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. దీంతో అమెరికాలోని ఓహియో రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. యువతను వ్యాక్సిన్వైపు మళ్లీంచేందుకు భారీ ఆఫర్ ప్రకటించింది. ‘వ్యాక్స్ ఏ మిలియన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్న యువతను లాటరీ విధానంలో ఎంపిక చేసి.. విజేతలకు 1 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదే ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అబ్బిగైల్ బుగెన్స్కే అనే 22 ఏళ్ల యువతి తన తొలి డోసు తీసుకుంది.
ఈ యువతిని అదృష్టం వరించడంతో జాక్పాట్ కొట్టింది. ‘వ్యాక్స్ ఏ మిలియన్’ కార్యక్రమంలో భాగంగా డ్రా తీసిన ఓహియే రాష్ట్ర గవర్నర్ లాటరీలో అబ్బిగైల్ బుగెన్స్కే 1 మిలియన్ డాలర్లను గెలుచుకున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా గవర్నరే ఫోన్ ద్వారా చెప్పడంతో యువతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే మరో నాలుగు వారాలపాటు ‘వ్యాక్స్ ఏ మిలియన్’ కార్యక్రమం కొనసాగుతుందని మరో నలుగురి విజేతలను ఎంపిక చేసి వారికి కూడా 1 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.