కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు దుర్మరణం చెందారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఎనిమిది మంది రోగులు మృతిచెందారు.
భారుచ్ -జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది. అర్థరాత్రి 1 గంట సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్ చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వచ్చామని, గంటలోపే మంటలను అదుపు చేశామని, 50 మంది రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొంటున్నారు. శివానంద్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మృతులకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంతాపం తెలిపారు.