ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. రబడ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్ (47 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) మరో అర్ధ శతకాన్ని సాధించాడు. పృథ్వీ షా (22 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు.
సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా జట్టుకు మరోసారి శుభారంభం చేశారు. వీరిద్దరి దూకుడుతో పవర్ప్లేలో ఢిల్లీ 63/0గా నిలిచింది. హర్ప్రీత్ బౌలింగ్లో పృథ్వీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం స్మిత్ (24)తో ధావన్ జట్టును లక్ష్యం వైపునకు నడిపించాడు. చివర్లో స్మిత్ అవుటైనా… 18వ ఓవర్లో 6, 6, 4 కొట్టిన హెట్మైర్ (4 బంతుల్లో 16 నాటౌట్) ఢిల్లీకి విజయాన్ని ఖాయం చేశాడు.