స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ భారత్ ను అతలాకుతలం చేసింది. రెండు వేవ్ ల నుంచి కోలుకోక ముందే ధర్డ్ వేవ్ కరోనా ముంచుకొస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మళ్లీ అందరిలో భయం నెలకొంది. ప్రధానంగా కరోనా ధర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల కేసులు నమోదు కాగా, బుధవారం ఒక్కరోజే 5.55 లక్షల కేసులు నమోదయ్యాయి. దాదాపు అన్ని దేశాల్లో పాజిటివిటీ రేటు నెమ్మదిగా పెరుగుతోంది. మన దేశంలో కూడా క్రమ క్రమంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లు ముందు కేరళ, ఆ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి మొదలయ్యాయి. తాజాగా కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఇక కేరళలో మూడు రోజుల క్రితం పాజిటివిటీ రేటు 10 శాతంగా నమోదైంది. అటు మహారాష్ట్రలో ప్రతి రోజూ 9 వేల మేర కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ లో కరోనా కేసుల నమోదులో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. జూన్ 20 నుంచి కేసులు తగ్గుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో జూలై 8 నుంచి 22 వరకూ ప్రతి రోజూ సగటు 2 వేల కేసులు నమోదయ్యాయి.
ఇదిలా కొనసాగుతుండగానే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయ్యేలా ఉందని నిపుణులు అంటున్నారు. కేరళ, మహారాష్ట్రల్లో నమోదవుతున్న కేసులను బట్టి ఆగస్టులోనే కరోనా ధర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. దీంతో ఆగష్టులో ధర్డ్ వేవ్ ముంచుకొచ్చే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే అంతా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.