కాబూల్- అఫ్ఘనిస్తాన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులకు అమెరికా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన 24 గంటల్లోనే ఐఎస్ ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు మొదలుపెట్టింది. కాబూల్ ఎయిర్ పోర్ట్ దగ్గర ఆత్మాహుతి దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్- ఖోర్సాన్ స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు అమెరికా ప్రకటించింది.
అఫ్గనిస్థాన్ లోని నంగర్హర్ ప్రావిన్సుల్లో ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా జరిగిన ఈ వైమానిక దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ తెలిపారు. సుమారు 20 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అమెరికా అంచనా వేస్తోంది. ఇకపై కూడా ఉగ్రస్థావరాలపై వైమానిక, డ్రోన్ల దాడులు చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. తమ సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తేల్చి చెప్పారు.
ఐతే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా ఈ దాడులను అఫ్ఘనిస్థాన్ బయట నుంచే చేపట్టింది. కాబూల్ ఎయిర్ పోర్ట్ అబే గేటు వద్ద గురువారం సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు, తాలిబన్లు, అఫ్గన్ పౌరులు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మంది వరకూ గాయపడ్డారు. ఉగ్రదాడి అనంతరం కాబుల్ విమానాశ్రయంలో శుక్రవారం తిరిగి అత్యవసర తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్రిటన్, ఫ్రాన్స్,స్పెయిన్ వంటి పలు దేశాలు ఈ రోజుతో తరలింపును ముగించాలని నిర్ణయించాయి.
ఇక కాబూల్ లో బాంబు దాడులు జరుగుతున్నా, దేశం విచిడి వెళ్లాలనే ఆత్రుత ఆప్ఘన్ పౌరుల్లో కనిపిస్తోంది. ఇప్పటికీ వేలాది మంది విమానాశ్రయం లోపలికి ప్రవేశించేందుకు మురికి కాలువలోకి దిగి వేచిచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎయిర్ పోర్ట్ లోకి అనుమతిస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.