ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు వార్తా పత్రికలు ‘‘వూహాన్ పరిశోధన శాల కుట్ర’’కోణంలో పలు వార్తలు ప్రచురించడంతో మరోసారి చర్చ మొదలైంది. వూహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్లో కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు అమెరికా నిఘా నివేదిక చెబుతున్నా ట్రంప్ ఆదేశించిన విచారణను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిలిపివేశారన్న ఆరోపణలతో కథనాలు రావడం గమనార్హం. అప్పట్లో కుట్ర కోణాన్ని కొట్టిపారేసిన బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథొనీ ఫాసీ లాంటి వారు కూడా కుట్ర జరిగిందేమో. పూర్తిస్థాయి విచారణ జరగాలనడం పరిస్థితిని మార్చేసింది. పరిశోధనశాల నుంచి తప్పించుకుందనడం తమపై బురద జల్లడమేనని అనడంతో ఆగిపోకుండా ఇతర దేశాల నుంచి ఆహారం ద్వారా తమ దేశంలోకి జొరబడి ఉండవచ్చీ మహమ్మారి అని ప్రత్యారోపణలు చేసింది కూడా.
చైనాలోని ఓ మారుమూల గనిలో తాము 2015లోనే కరోనా వైరస్ను గుర్తించామని, ప్రొఫెసర్ షి ఝింగ్లీ గత వారమే ఓ పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారని చైనా ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఆ గనిలోని గబ్బిలాల్లో 8 రకాల కరోనా వైరస్లు గుర్తించామని, దీనికంటే పాంగోలిన్ అనే అడవి జంతువులోని కరోనా వైరస్లతో ప్రమాదం ఎక్కువని కూడా ఈ వ్యాసంలో ఉండటం గమనార్హం. కరోనా వైరస్ పుట్టుకపై శాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయమైతే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల నివేదిక అస్పష్టంగా ఉందని పలువురు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. నిపుణుల బృందం విచారణను చాలా తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోందని, ప్రమాదవశాత్తూ బయటపడిందా? సహజసిద్ధంగా మనుషుల్లోకి ప్రవేశించిందా తేల్చే సమాచారాన్ని సేకరించి ఉండాల్సిందని కొందరు శాస్త్రవేత్తలు సైన్స్ మ్యాగజైన్కు లేఖ రాశారు. కుట్ర కోణాన్ని క్షుణ్ణంగా విచారించాలని వీరు కోరుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసిస్ స్వయంగా సరికొత్త విచారణ జరగాలని కోరడం విశేషం.