సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ కనిపించే పైపై మెరుపులను చూసి చాలా మంది నిజమని భావించి.. ఆకర్షితులవుతారు. తీరా తత్వం బోధపడిన తర్వాత.. ఆ వైపు చూడాలన్నా ఇష్టపడరు. ఎక్కడో కొందరు అదృష్టవంతులకు మాత్రమే ఎలాంటి ఇబ్బందులు రాకుండానే అవకాశాలు తలుపు తడతాయి. ఇక మన సమాజమే పురుషాధిక్య సమాజం అయినప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఆడవారికి అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు. బయట కన్నా సినిమా లోకంలో ఆడవారికి ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువ. హీరోయిన్ అంటే కేవలం హీరో పక్కన నాలుగు పిచ్చి గెంతులు వేసి.. పీలికల్లాంటి బట్టలు ధరించి.. శరీర ప్రదర్శన చేస్తే చాలు. అంతకు మించి సినిమాల్లో హీరోయిన్లు చేసేది కూడా ఉండదు. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే.. స్కిన్ షో తప్పనిసరి. చాలా కొద్ది మంది మాత్రమే ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు.
అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కెరీర్ ప్రారంభంలో అన్ని హద్దులు దాటి ప్రవర్తించే హీరోయిన్లు.. ఓ దశకు వచ్చాక.. అవకాశాలు తగ్గాక.. పైన చెప్పుకొన్న విషయాలను ఏకరవు పెడతారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ జాబితాలో చేరారు. ఇండస్ట్రీలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఉండదని.. సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయింది. తాజాగా ఓ భేటీలో పాల్గొన్న తమన్నా.. పలు సంచలన ఆరోపణలు చేసింది.
ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎన్నో అసమానతలు ఉంటాయని తెలిపింది . తాను పని చేసిన చిత్రాలల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే దానిని వారు వినేవారు కాదని.. పైగా తనదే నేరం అయినట్లు చూసేవారని చెప్పుకొచ్చింది. ఆ తరువాత తన అభిప్రాయం సరైందేనా.. కాదా.. అన్న విషయం గురించి తానే మళ్లీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదని వెల్లడించింది. అంతేకాక సినిమా ఇండస్ట్రీలో మహిళలకు తగిన గౌరవం దక్కదని.. ఇక్కడ హీరోయిన్ అంటే కేవలం హీరోలను ప్రేమించడానికి మాత్రమే అన్నట్లు చూస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది తమన్నా. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని.. కథాపాత్రలు తమను వెతుక్కుంటూ వస్తున్నాయని అన్నది.
కానీ పారితోషికం విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి మార్పు లేదని.. హీరోలకే అధిక మొత్తం చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరని.. అదే హీరోయిన్లు రాకపోతే.. వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపింది తమన్నా. మిల్కీ బ్యూటీ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.