కరోనా ఉద్ధృతి వల్ల వేసవిలో రావాల్సిన పలు చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. దీంతో సినీ ప్రియులకు వినోదాల్ని అందించే బాధ్యతను ఓటీటీలు మరోమారు అందిపుచ్చుకున్నాయి. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా అనసూయ నటించిన ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం విడుదలైంది. ఇప్పుడీ బాటలోనే దాదాపు అరడజను వరకు చిన్న సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవలే ‘లెవెన్త్ అవర్’ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి తమన్నా. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘నవంబర్ స్టోరీ’తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్సిరీస్ ఇది. తండ్రి హత్య కేసులో ఇరుక్కుంటే.. ఆయన్ను, ఆయన ప్రతిష్ఠను కాపాడుకునే కూతురు పాత్రలో తమన్నా నటించింది. ఈ సిరీస్ ఈనెల 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రసారం కానుంది.
ప్రేక్షకుల ముందుకు రానున్న వాటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ‘రాధే’. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. దిశా పటానీ కథా నాయిక. ఓ పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. మే 13న థియేటర్లతో పాటు డిజిటల్ ఫార్మెట్లోనూ ఒకేసారి విడుదలవుతోంది. దీన్ని ‘పే ఫర్ వ్యూ’ పద్ధతిలో ‘జీ ఫ్లెక్స్’ ఓటీటీతో పాటు డీటీహెచ్ ఆపరేటర్స్ అయిన డిష్, డీటుహెచ్, టాటా స్కై, ఎయిర్టెల్ డిజిటిల్ టీవీల్లోనూ వీక్షించొచ్చు. ప్రముఖ దర్శకులు రాజ్ డీకే నిర్మించిన ‘సినిమా బండి’, దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, రామ్గోపాల్ వర్మ ‘డి-కంపెనీ’ ఈవారంలోనే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో రూపొందిన ‘సినిమా బండి’ మే 14న నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుండగా అదే రోజు జీ5 ఓటీటీలో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ విడుదల కానుంది.