అనితా చౌదరి.. ఇలా అనే కంటే ‘కస్తూరి’ అంటే ఇంకా బాగా గుర్తుపడతారు బుల్లితెర తెలుగు ప్రేక్షకులు. యాంకర్గా తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్ట్ గా, సినిమాల్లోనూ నటించి మెప్పించారు. యాంకర్లు కావాలని వచ్చిన ప్రకటనకు.. అనితాకు చెప్పకుండా ఫ్రెండ్స్ ఆమె ఫొటో పెట్టగా ఈటీవీ నుంచి యాంకర్గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందాన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత యాంకర్ గా ఎన్నో మంచి అవకాశాలు దక్కాయి. తర్వాత మంజులా నాయుడు దర్శకత్వం వహించిన ‘కస్తూరి’ సీరియల్లో లీడ్ రోల్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి అనితా చౌదరి కాస్తా.. కస్తూరిగా మారిపోయింది. అలనాటి సంగతులను తజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
“ఈ సీరియల్ ఏడేళ్ల పాటు సాగింది. ఆ సమయంలో అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా నా ప్రేమలో పడిపోయారు. నన్ను బాగా ఇష్టపడేవారు. అప్పట్లో నాకు కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు వచ్చేవి. సోషల్ మీడియా లేదు కదా.. ఆ ఉత్తరాలను చదివేదానిని. కొందరు భర్తలు అయితే తమకు భార్యలు అన్నం పెట్టడంలేదంటూ ఫిర్యాదులు చేసేవాళ్లు. మధ్యాహ్నం 12 గంటలకు మీ సీరియల్ వస్తోంది.. మా భార్యలు మాకు అన్న పెట్టడం లేదని చెప్పేవాళ్లు. అంతటి అభిమానం సొంతం చేసుకున్నాను. ప్రేక్షకుల అభిమానాన్ని మించిన అవార్డులు ఏముంటాయి చెప్పండి” అంటూ అనితా చౌదరి వ్యాఖ్యానించారు.
కస్తూరి సీరియల్ తర్వాత రుతురాగాలు, నాన్న అనే సీరియళ్లలోనూ నటించారు. అయితే అమృతం సీరియల్తో అనితాకు బుల్లితెర ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అమృతం భార్యగా.. అనితా ఎంతో అమాయకంగా నటించేది. శివాజీ రాజా, అనితా, గుండు హనుమంతురావు, రాగిణిల యాక్టింగ్కి, కామెడీ టైమింగ్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ తర్వాత సినిమాల్లోనూ అనితకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే సీరియల్స్ లో కస్తూరి ఎలాగో.. సినిమాల్లో ఛత్రపతిలో పాత్ర అంత పేరు తీసుకొచ్చింది. “సూరీడు.. ఓ సూరీడు.. ఏడున్నావురా? బస్సుకు ఏలవుతోంది” అనే డైలాగ్ ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఒక యాంకర్గా, సీరియల్ నటిగా, సినిమా ఆర్టిస్ట్ గా అనితా చౌదరికి ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు.