మందు తాగాలంటే చాలా స్పాట్లు ఉన్నాయి. కానీ, ఇద్దరు మిత్రులు… ఏకంగా గాలి పరుపుపై తేలుతూ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. బీరు సీసాలను కూడా తీసుకెళ్లారు. అప్పటివరకు వారు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, ఆ తర్వాతే అసలు కష్టాలు ఎదురయ్యాయి. సముద్రంలో గాలి తీవ్రత పెరగడంతో తీరం నుంచి సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. ఒక పక్క నవ్వు.. మరో పక్క కోపం.. చివరిగా వారిపై జాలి కలుగుతుంది. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన జాక్సన్ పెర్రే, నోహ్ పాల్మర్లు తమ ఇంటి ఎదురుగా ఉన్న సముద్ర తీరంలో బీర్లు తాగుతూ టైంపాస్ చేస్తుంటారు. అయితే, ఓ రోజు వారికి ఇంట్లో పాడుబడిన ఓ ఎయిర్ పరువు కనిపించింది. గాలి కొట్టి చూస్తే బాగానే ఉన్నట్లు అనిపించింది. దీంతో వారికి ఓ చెత్త ఐడియా వచ్చింది. గాలి పరుపు నీటిపై తేలుతుంది కాబట్టి తీరంలో నీటి అలలపై తేలుతూ మందు కొడితే మజాగా ఉంటుందని భావించారు. అనుకున్నట్లే పరుపును సిద్ధం చేసుకుని, ఓ ఐస్ బాక్సు నిండా బీర్లు నింపుకుని సముద్రంలోకి బయల్దేరారు. బీర్లు పెట్టుకుని అటూ ఇటూ కూర్చుని పరుపుని బ్యాలెన్స్ చేశారు. అయితే జాక్సన్, నోహ్లు తెలియకుండానే పరుపుతో సహా మహా సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారికి ఏం చేయాలో తోచలేదు. వారి ఫోన్ బ్యాటరీల ఛార్జింగ్ కూడా తగ్గిపోతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఎలాగోలా వారికి ఫోన్ సిగ్నల్ అందింది. దీంతో వారు తమ ఫ్రెండ్ టెక్స్ సీక్కు ఫోన్ చేశారు. అతడు నీటిలో నడిచే స్కూటర్ – జెట్ స్కీ మీద బయల్దేరి జాక్సన్, నోహ్ల కోసం వెతికాడు.
టెక్స్ లక్కీగా పరుపు మీద తేలుతున్న తన ఇద్దరి స్నేహితులను కనిపెట్టగలిగాడు. ఎట్టకేలకు వారిని హిందూ మహాసముద్రంలో కొట్టుకుపోకుండా కాపాడగలిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఇద్దరితోపాటు, వారిని రక్షించిన స్నేహితుడు కూడా రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయారు. 100 మీటర్ల వరకు వెళ్లి వెనక్కి వచ్చేయాలని అనుకున్నా సముద్రంలో షార్క్ చేపలు ఉంటాయని తెలిసినా.. పెద్దగా వర్రీ కాలేదు. అయితే, బీరు సీసాలు అడుగంటడం మొదలైన తర్వాతే ఆందోళన పడ్డారు . అంతేగాక, ఆ పరుపు పైన రంథ్రాల్లోకి నీరు చేరి మునిగిపోవడం మొదలైంది. అసలైన భయం అప్పుడే మొదలైందని చెప్పడం గమనార్హం. ఫ్రెండొకడు ఉండాలి. అయితే వాడు కాపాడేవాడే అయ్యుండాలి. కలిసి మందు కొట్టే రకం కాకూడదు.