దొంగ ఎక్కడైనా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం చూశారా? ఎప్పుడో గానీ ఇలా జరగదు. కానీ ఒక బైక్ దొంగ స్వయంగా పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి బాబోయ్ అంటూ పశ్చాత్తాపం చెందుతున్నాడు.
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని చూసి నేరస్థులు భయంతో వణికిపోతున్నారు. యూపీలో నేరాలను తగ్గించేందుకు నేరస్తులను ఎన్కౌంటర్ లో లేపేయండి అంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో కనిపించిన వారిని జనాభా లెక్కల్లో కనిపించకుండా ఎన్ కౌంటర్ లో లేపేస్తున్నారు పోలీసులు. దీంతో తమను పోలీసులు ఎక్కడ ఎన్కౌంటర్ లో లేపేస్తారో అని నేరస్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నిన్ననే ఒక ఖైదీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని డయాలసిస్ చేయించడానికి పోలీసులు హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే.. నేను రాను బాబోయ్ అని మొత్తుకున్నాడు.
తనను ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారో అని భయంతో హాస్పిటల్ కి రానని మొరాయించాడు. ఎన్కౌంటర్ చేయనని హామీ ఇస్తే వస్తా అని మొండిపట్టుదల పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తాజాగా ఒక దొంగ తనకు తానుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ముజఫర్ నగర్ జిల్లా మన్సూర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంకుర్ అనే మోటార్ సైకిళ్ళ దొంగ ప్లకార్డుతో వచ్చి మరీ పోలీసులకు లొంగిపోయాడు. ‘యోగీజీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి’ అంటూ ప్లకార్డు మీద రాసుకొచ్చాడు. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమో అన్న భయంతో గ్రామ పెద్దను, కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తనను క్షమించమని పోలీసులను వేడుకున్నాడు. ఇకపై ఎప్పుడూ నేర చేయనని అన్నాడు.
ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు. లూటీలు చేయడం, హత్యాయత్నం వంటి కేసుల్లో అంకుర్ నిందితుడిగా ఉన్నాడని స్టేషన్ హౌజ్ అధికారి వెల్లడించారు. పోలీసులు క్రిమినల్ కేసుల్లో నిందితులను ఎన్కౌంటర్ చేసిన మరుసటి రోజే దొంగ ఇలా లొంగిపోవడం గమనార్హం. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ యూపీలో 9 వేల ఎన్కౌంటర్లు జరిగాయని, వీళ్ళలో దాదాపు 160 మంది అనుమానిత నేరస్థులు హతమైనట్లు ఖతౌలి డీఎస్పీ రవిశంకర్ మిశ్రా వెల్లడించారు. మొత్తానికి పోలీసులు ఎక్కడ తమను ఎన్కౌంటర్ లో లేపేస్తారో అని భయంతో నేరస్థులు భయంతో వణికిపోతున్నారు. ఇదంతా సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వడం వల్లే సాధ్యమైంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.