దేశంలో యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద షాప్ ల వరకు అన్నిచోట్ల యూపీఐ బోర్డ్స్ దర్శమిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వాట్సాప్ చాలా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో వీటితో పోటీపడేందుకు వాట్సాప్ సరికొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా ఆఫర్లను ప్రకటించి యూజర్లను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఇప్పటికే.. 4 కోట్ల మంది యూజర్లను కలిగిఉన్న వాట్సాప్.. 10 కోట్ల మందికి ఈ సేవలను విస్తరించడానికి షనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నుంచి అనుమతులు తీసుకుంది. ఈ నేపథ్యంలో క్యాష్బ్యాక్ ఆఫర్లతో ప్రజలకు చేరువయ్యేందుకు సిద్ధమైంది. మే చివరి నాటికి వాట్సాప్ లో క్యాష్బ్యాక్ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఒక్కో యూజర్ కు 33 రూపాయలు చొప్పున క్యాష్బ్యాక్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినందట. మూడు లావాదేవీలకు గానూ ఈ మొత్తాన్ని క్యాష్బ్యాక్ కింద ఇవ్వనున్నారు. అయితే, ఈ క్యాష్బ్యాక్ చూడ్డానికి తక్కువగా ఉన్నా యూజర్లను ఆకట్టుకోవడంలో కొంతమేర దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్! ఒకే అకౌంట్.. రెండు స్మార్ట్ఫోన్లలో..
ప్రస్తుతం దేశంలో 50 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. కేవలం మెసేజింగ్ కే కాక, ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవడానికీ వాట్సాప్ ఉపయోగపడుతోంది. దీంతో వాట్సాప్ నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. ఇదే తరహాలో ఒకసారి పేమెంట్స్ కు కూడా అలవాటు పడితే అగ్రస్థానం వాట్సాప్ దే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.