సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యక్తులను టార్గెట్ చేసి అవమానిస్తే అరెస్టులు తప్పవు. వాట్సాప్ గ్రూపులోనే కదా సీఎం, పీఎంలని తిడుతూ పోస్టులు పెడితే ఏమవుతుంది అనుకుంటే పొరపాటే. నచ్చని వాళ్ళు ఫిర్యాదు చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
సోషల్ మీడియా ప్రభావం పెరిగాక సామాన్యులు కూడా అన్యాయం పట్ల తమ గళం ఎత్తుతున్నారు. సామాజిక మాధ్యమాల వల్ల త్వరగా సమాచారం తెలుసుకోవడమే కాకుండా.. సమస్యలను ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లగలుగుతున్నారు. అయితే ఇదే సోషల్ మీడియాను కొంతమంది విమర్శల కోసమే అన్నట్టు వాడుతున్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం.. మిగతా పార్టీల నేతలను విమర్శించడం.. కొన్ని సార్లు పరిధి దాటి బూతులు తిట్టడం వంటివి చేస్తుంటారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులను కించపరిచేలా మాట్లాడడం, చిత్రాలు, వీడియోలు షేర్ చేస్తూ శునకానందం పొందుతుంటారు. అలా చేసిన వాళ్ళు జైలుకి కూడా వెళ్లారు.
తాజాగా వాట్సాప్ గ్రూపులో సీఎంని కించపరుస్తూ పోస్టులు పెట్టిన గ్రూప్ అడ్మిన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కి చెందిన షాహబుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నాడు. ఆ గ్రూప్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కించపరిచే పోస్టులు పెట్టాడు. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో పోలీసులు గ్రూప్ అడ్మిన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని కొత్వాలీ పోలీసు స్టేషన్ అధికారి కుమార్ సేత్ తెలిపారు. గ్రూప్ అడ్మిన్ ని షాహబుద్దీన్ గా గుర్తించామని.. అయితే తమకు ఫిర్యాదులు అందిన తర్వాతే అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘నగర పాలిక పరిషత్ బదోనీ’ వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నాడని.. బదోనీకి సంబంధించిన నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, స్థానికులు ఆ గ్రూప్ లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ని క్రియేట్ చేశారని.. అయితే ఇది కార్పొరేటర్లకు సంబంధించిన అధికారిక గ్రూప్ కాదని పోలీసులు స్పష్టం చేశారు.
In UP’s Bhadohi, WhatsApp group admin Sahabuddin Ansari was arrested after a member allegedly posted an inappropriate message against UP CM Yogi Adityanath in the group. pic.twitter.com/OjClkkcOxd
— Piyush Rai (@Benarasiyaa) August 7, 2023