బ్యాంకింగ్ వ్యవస్థలో గత కొన్నేళ్లుగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం డిజిటల్ రంగం వైపు పరుగులు తీస్తోంది. ప్రజలు ఫిజికల్ క్యాష్ కి బదులు యూపీఐ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్.. ఇలా అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు చాలా సులభతరం అయ్యాయి. సెకన్లలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లభించింది. ఈ పద్ధతిలో డబ్బును బదిలీ చేయడం వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
అవేంటంటే.. కొన్ని సార్లు పొరపాటున ఇతరుల బ్యాంకు అకౌంట్కి డబ్బులు బదిలీ చేస్తుంటాము. కానీ, వాటిని ఎలా తిరిగి డబ్బులు పొందాలో అర్థం కాదు. తొందరపడి తప్పుడు అకౌంట్ కు డబ్బును బదిలీ చేసినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి పొందడానికి కొన్ని మార్గాలున్నాయి.
వెంటనే బ్యాంకుకు తెలియజేయడం..
తప్పు అకౌంట్ నెంబర్కు డబ్బులు పంపితే వెంటనే సంబంధిత బ్యాంకుకు ఈ విషయం గురించి చెప్పాలి. పొరపాటున వేరే అకౌంట్కు ఎలా డబ్బులు పంపించారో వివరించాలి. కస్టమర్ సర్వీస్కు కాల్ చేసి మొత్తం డిటైల్స్ను చెప్పాలి. ఈ–మెయిల్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్కు సంబంధించిన డిటైల్స్ను బ్యాంక్ కోరితే పంపాల్సిన వసరం ఉంటుంది. ట్రాన్సాక్షన్ జరిగిన డేటు, టైమ్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, డబ్బులు పంపిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ డిటైల్స్ను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడకపోతే..
తాజాగా.. డబ్బులు ఎవరికైన ట్రాన్సఫర్ చేసిన తర్వాత ఒక మెసేజ్ వస్తోంది. ట్రాన్సక్షన్ తప్పుగా జరిగితే వెంటనే.. ఈ నెంబర్కు మెసేజ్ చేయాలని చెబుతూ ఇందులో ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఇలా మెసేజ్లు పంపమని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. పొరపాటున రాంగ్ అకౌంట్కు డబ్బులు పంపితే బ్యాంకులు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది.