ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం. స్నాక్స్ మొదలు.. స్మార్ట్ టీవీ వరకు ఇలా ఏది కావాలన్నా.. సరే ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మన చేతిలోకి వస్తాయి. షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తే.. వస్తువును పట్టి చూస్తాం కాబట్టి.. దాని నాణ్యత తెలుస్తుంది. బట్టల విషయానికి వస్తే.. కూడా ఇలానే స్వయంగా చూస్తాం కాబట్టి.. రంగు, నాణ్యత, సైజ్ వంటివి తెలుస్తాయి. కానీ ఆన్లైన్ కొనుగోళ్లలో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. మరి ఎలా కొనుగోలు చేయడం అంటే.. రివ్యూల మీద ఆధారపడతాం. గతంలో ఆ ఉత్పత్తని కొనుగోలు చేసిన వారు.. లేదా దానిన వాడిన వారు.. తమకు ఎదురైన అనుభవాల ద్వారా సదరు ఉత్పత్తులకు రేటింగ్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఆయా ఉత్పత్తులను కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాం. మరి ఇలా రివ్యూ ఇచ్చే వారంతా.. నిజంగానే ఆయా ఉత్పత్తులను కొన్నావారేనా.. లేక డబ్బులు తీసుకుని ఇలా రివ్యూలు ఇచ్చేవారా అన్న సంగతి మనకు తెలియదు.
అయితే ఇక మీదట ఇలాంటి రివ్యూలకు కేంద్రం చెక్ పెట్టనుంది. పెయిడ్ రివ్యూలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. ఫేక్ రివ్యూలకు అడ్డుకట్ట వేయడం కోసం నూతన నిబంధలను తీసుకురానుంది. దీని ప్రకారం ఇక మీదట ఆయా ఈ కామర్స్ సైట్లు.. తాము అందించే ఉత్పత్తలు, సేవలకు సంబంధించిన రివ్యూలకు సంబంధించి వాస్తవ సమాచారం అనగా.. అవి వినియోగదారులు ఇచ్చిన రివ్యూలా లేక.. పెయిడ్ రివ్యూలా అనే విషయాన్ని తప్పకుండా వెల్లడించాలని కేంద్రం ఆదేశించింది. నవంబర్ 25 నుంచి రివ్యూలకు సంబంధించి ఈ నూతన నిబంధలను అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు స్వచ్ఛందంగా అన్ని పెయిడ్ రివ్యూల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ వినియోగదారుల రివ్యూలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ పేరిట కొత్త ప్రమాణాన్ని రూపొందించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం వెల్లడించారు. ఉత్పత్తులు .. సర్వీసుల సరఫరాదారులు, తమ సొంత కస్టమర్ల నుంచి రివ్యూలను సేకరించే సంస్థలు, సరఫరాదారు నియమించుకున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టరు సహా కన్జూమర్ రివ్యూలను ఆన్లైన్లో ప్రచురించే అన్ని సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. కొత్త నిబంధనలు అమ్మల్లోకి వచ్చిన తర్వాత ఇతరుల నుండి కొనుగోలు చేసిన సమీక్షలు, అలాగే సరఫరాదారు లేదా థర్డ్ పార్టీ తమ ఉత్పత్తులు/సర్వీసుల రివ్యూ కోసం నియమించుకున్న ఉద్యోగులు రాసే సమీక్షలను ప్రచురించకూడదు అని తెలిపారు.
ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ పోర్టల్స్.. ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు.. బీఐఎస్ రానున్న 15 రోజుల్లో.. సంబంధిత సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా సింగ్ తెలిపారు. ఈ–కామర్స్ సంస్థలు ఈ సర్టిఫికేషన్ కోసం బీఐఎస్కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర దేశాల్లో.. తప్పుడు రివ్యూలకు అడ్డుకట్ట వేయడానికి నానా తంటాలు పడుతుంటే.. ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టేందుకు ఈ తరహా ప్రయత్నం చేసిన తొలి దేశంగా ఇండియా నిలిచింది అన్నారు. మన దేశంలో ప్రధానంగా టూర్..ట్రావెల్, రెస్టారెంట్లు .. హోటళ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సింగ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో తప్పుడు రివ్యూలకు చెక్ పెట్టేందుకు ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చాము అన్నారు.
కొత్తగా తీసుకువచ్చిన ఈ నిబంధనల ప్రకారం.. ఏ సంస్థలోనైనా రివ్యూలను హ్యాండిల్ చేసే బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిని రివ్యూ అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తారు. సమీక్షలు చట్టబద్ధమైనవిగా, కచ్చితమైనవిగా, వినియోగదారులను తప్పుదోవ పట్టించని విధంగా ఉండేలా చూసే బాధ్యత అతడితే. రివ్యూ చేసే వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వెల్లడించకూడదు. సమీక్షలసేకరణ పక్షపాతరహితంగా ఉండాలి.