సిటీలోనే కాదు, పల్లెటూర్లలో కూడా స్థలాలు కొనడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. చాలా మంది మధ్యతరగతి వ్యక్తులు పెద్ద పెద్ద సిటీల్లో స్థలాలు కొనలేక తమ దగ్గర ఉన్న డబ్బుతో సొంత ఊర్లలో స్థలాలు కొంటున్నారు. రెండు, మూడు నెలల్లోనే ఆ రేట్లు పెరిగిపోతున్నాయి. మంచి రేటు వచ్చాక అమ్ముకుని లాభాలు గడిస్తున్నారు. మీరు కూడా తక్కువ రేటుకి పల్లెటూరులో స్థలం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి.
ఇప్పుడు చాలా మంది డబ్బు సంపాదనలో పడిపోయారు. చిట్టీ డబ్బులతో సొంత ఊరిలోనే ఎక్కడైనా స్థలం ఉంటే కొని పక్కన పెట్టుకుంటున్నారు. ఏడాదిలోనే మంచి లాభాలను పొందుతున్నారు. అదృష్టం బాగుంటే స్థలం కొన్న రెండు, మూడు నెలలకే ల్యాండ్ రేటు పెరిగిపోతుంది. అయితే పల్లెటూర్లలో కొంటే ఏముంటుంది లాభం.. వైజాగ్, అమరావతి లాంటి ఏరియాల్లో కొంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కానీ పెట్టుబడి ఉన్నవారికి ఎక్కడైనా పర్లేదు. కానీ మధ్యతరగతి వ్యక్తులకే అంత డబ్బు సర్దుబాటు చేసుకోవడం అసాధ్యం. అందుకే పల్లెటూర్లలో స్థలాల మీద పెట్టుబడి పెట్టుకుంటే వారు కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
నగరాల్లో ఉన్న స్థలం ధరలతో పోలిస్తే గ్రామాల్లో తక్కువ ఉంటాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి వారికి ఇన్వెస్ట్ చేసేందుకు పల్లెటూర్లు అనుకూలంగా ఉంటాయి. ప్రధాన నగరాల్లో ఎక్కువ రేటు పెట్టి కొనలేని వారు తక్కువ ధరకే సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో కొనుగోలు చేస్తే మంచి లాభాలు ఉంటాయి. నగరాలతో పోల్చుకుంటే పల్లెటూర్లలో ధరలు తక్కువైనా గానీ డిమాండ్ మాత్రం తగ్గదు. దానికి తగ్గా లాభం దానికి వస్తుంది. సిటీ నుంచి 30, 40 కి.మీ. దూరంలో ఉన్న పల్లెటూర్లలో స్థలాలు కొంటే బాగుంటుంది. వైజాగ్ చూసుకుంటే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో దేశపాత్రునిపాలెం, నక్కపల్లి వంటి గ్రామాలు ఉన్నాయి.
అక్కడ గజం రూ. 7,500 నుంచి 11,250 మధ్యలో ఉన్నాయి. అలానే అమరావతి, తిరుపతి, కాకినాడ వంటి ఏరియాల చుట్టుపక్కల్లో ఉన్న పల్లెటూర్లలో కూడా ఇంచుమించు ఇవే రేట్లు ఉన్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు, విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్ట్ వంటి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం స్వీకారం చుట్టడంతో సమీప ఏరియాల్లో ఇప్పటికే ల్యాండ్ రేట్లు పెరిగాయి. ఈ లొకేషన్స్ కి దగ్గరలో ఉన్న పల్లెటూర్లలో ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ కొనడం వల్ల లాభం ఉంటుందా అని సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది.
అంటే ఒకప్పుడు మన పాలకులు తీసుకెళ్లి హైదరాబాద్ ని మాత్రమే డెవలప్ చేసినట్టు.. ఏపీలో కూడా కేవలం ఒకే నగరాన్ని కాకుండా ప్రతీ నగరాన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ కారణంగా వైజాగ్, అమరావతి, గుంటూరు, విజయవాడ, కాకినాడ వంటి ఏరియాల్లో పలు పరిశ్రమలు వస్తాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి అనేది నగరం చుట్టూతా విస్తరిస్తుంటుంది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న పల్లెటూర్లలో ఉన్న ల్యాండ్ ధరలు కూడా పెరుగుతాయి. పూర్తిగా డెవలప్ అయ్యి రియల్ ఎస్టేట్ బూమ్ అందుకున్నాక నగరాల్లో స్థలాలు కొనలేని వారు సిటీకి దూరంలో కొనుగోలు చేయాలని చూస్తారు. ఆ సమయంలో పల్లెటూర్లలో ఉన్న భూములపై డిమాండ్ పెరుగుతుంది. ఎలా చూసినా గానీ పల్లెటూరులో స్థలం కొనడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలైతే ఉంటాయి.