ఒకటా, రెండా.. ఏకంగా పద్నాలుగేళ్లుగా ఆసియా ధనవంతుల్లో నెంబర్ వన్ ఆయనే. ఈ కాలంలో బాగా డబ్బున్న వాడిని ఆయనతోనే పోలుస్తారు. ఎప్పుడు ఆయన సంపద పెరగడమే కానీ.. తరిగింది లేదు. వ్యాపార రంగంలో కొత్త కొత్త ఆలోచనలతో చరిత్ర సృష్టించే వ్యక్తి ఆయన. సరికొత్త ఆవిష్కరణలతో వ్యాపార రంగలో దూసుక పోతుంటాడు. అలాంటి వ్యక్తిని దాటేసి ముందుకు వచ్చాడు మరొక వ్యక్తి. ఆ ఇద్దరు వ్యక్తులెవరంటే.. మొదటి వ్యక్తి ముకేశ్ అంబానీ రెండో వ్యక్తి గౌతమ్ ఆదానీ. తాజాగా రిలయన్స్ అధినేతను దాటేసి ఆసియా నంబర్ వన్ గా నిలిచారు అదానీ.
ఇప్పటి వరకు ఆసియాలో అత్యధిక సంపదన కలిగిన వ్యక్తి ఎవరంటే ముకేశ్ అంబానీ అని సమాధానం వినిపించేది. అలా 14 ఏళ్లుగా ఆసియా కుబేరుడిగా స్థిరపడి పోయారు. ఆయన దరిదాపులోకి కూడా ఎవరు రాలేనంతగా ఎదిగారు. దీంతో ఈతరం వారిలో ఆయన పేరు గుర్తుండిపోయింది. కానీ తాజాగా ఆసియా కుబేరుడి అగ్రస్థానంలో నుంచి ఆయన పేరు మారాల్సి వచ్చింది. కారణంగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించడమే.
ఇది కూడా చదవండి : జుకర్ బర్గ్ హెచ్చరిక.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిపివేస్తాం!
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లిస్ట్ ప్రకారం.. గౌతమ్ అదానీ 88.5 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉండగా.. 87.9 బిలియన్ డాలర్లతో 11వ స్థానాన్ని అంబానీ దక్కించుకున్నారు. కానీ ఫోర్బ్స్ రియల్టైం బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం చూస్తే అదానీ 91.2 బిలియన్ డాలర్లలో పదో స్థానంలో 89.3 బిలియన్ డాలర్లతో అంబానీ 11వ స్థానంలో కొనసాగుతున్నారు. వ్యక్తుల రోజువారీ సంపదను లెక్కించేందుకు బ్లూమ్ బెర్గ్, ఫోర్బ్స్ వేర్వేరు పద్ధతుల్ని అనుసరిస్తాయి. అందుకే రెండు జాబితాల ప్రకారం వీరిద్దరి సంపద విలువలో స్వల్ప తేడాలుంటాయి.
కరోనా మహమ్మారి సంక్షోభంతో యావత్తు ప్రపంచం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ అదానీ సంపద మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. ఈయన గతేడాది రోజుకు రూ.1000 కోట్లకు పైగా ఆర్జించారని నివేదిక తెలిపింది. దీంతో ఏడాది వ్యవధిలో సంపద విలువ 261 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు చేరగా ఆయన ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన కంపెనీలు 5 ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కేవలం తొమ్మిది నెలల్లో అదానీ నికర సంపద రెండింతలైనట్లు ఫోర్బ్స్ తెలిపింది.
రెండు జాబితాల ప్రకారం కూడా అదానీ, ముకేశ్ ల సంపద మధ్య స్వల్ప తేడానే ఉంది. సంపదల మధ్య స్వల్ప తేడానే ఉండడంతో ఈ స్థానాలు రోజుల వ్యవధిలోనే తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో ముకేశ్ అంబానీను ఫార్మా దిగ్గజం దిలీప్ సంఘ్వీ వెనక్కి నెట్టినా ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. అప్పట్లో జాబితాలో మిగతా వారితో పోలిస్తే అంబానీ చాలా ముందుండేవారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. ఇన్నేళ్ల తరువాత ఆసియా కుబేరుడి స్థానంలో మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.