వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి సమాయత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ప్రస్తుతం ఇరు పార్టీ సభ్యులు ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై దివంగత నేత ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పై నందమూరి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నానికి లేదని అన్నారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగు దేశం పార్టీ అని.. కన్నీతల్లిలాంటి పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడని అన్నారు. కొంత కాలంగా టీడీపీ పార్టీని టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని.. నందమూరి కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి లేదని అన్నారు. ప్రతిసారి నందమూరి వంశాన్ని నాశనం చేసింది చంద్రబాబు అని అంటారు.. అసలు మోసం అనే పదానికి నానినే సరైన ఉదాహారణ అన్నారు. నందమూరి కుటుంబం గురించి మాట్లాడితే తన పార్టీ నేతలు మెచ్చుకుంటారని భావిస్తున్నారేమో.. కానీ యావత్ తెలుగు ప్రజలు ఛీ కొడుతున్న విషయం గ్రహించడం లేదు అన్నారు.
ఏపీలో అధికార పార్టీ పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. మా ఇంటి అల్లుడు చంద్రబాబు నిమ్మకూరి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అత్తారింటికి అల్లుడు వస్తే.. చంద్రబాబు కృష్ణా జిల్లా రావటానికి అర్హత లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనడం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. చంద్రబాబు కి ఎక్కడికైనా వెళ్లే అధికారం., అర్హత ఉందని అన్నారు నందమూరి రామకృష్ణ. ఇక రాష్ట్రంలో అధికార పార్టీ చెప్పుకునేంత గొప్ప అభివృద్ది జరగలేదని.. ఒకదశలో నలభై ఏళ్ల వెనక్కి తీసుకు వెళ్లిందని ప్రజలు అర్ధం చేసుకున్నారు. అడుక్కోవడానికి చిప్పకూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం అంతా ఒకే వేదికపై ఉన్నామని.. మాలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానున్నది తెలుగు దేశం పార్టీ.. ఏపీ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త పండుగ చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయని అన్నారు.