ఆర్ధికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం కింద జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా తానే స్వయంగా బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు వైఎస్ జగన్. తాజాగా ఆయన చేనేత కార్మికుల కోసం ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఈ నెల 23న వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. చేనేత పనులను మెరుగుపరిచేందుకు ఆర్ధిక సహాయం అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గత మూడేళ్ళుగా ఏపీ ప్రభుత్వం సొంత మగ్గం ఉండి, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ. 24 వేలు జమ చేస్తుంది.
చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హుల జాబితాలను సచివాలయాలకు పంపించారు. పెడన నియోజకవర్గ పరిధిలో 3,161 మంది లబ్ధిదారులు ఉన్నారు. కృష్ణా జిల్లా పెడనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించి.. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐదేళ్ళలో ప్రతీ లబ్ధిదారుడు రూ. 1.2 లక్షల సహాయాన్ని అందుకుంటారు. ఈ పథకం వర్తించాలంటే.. దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు అయి ఉండాలి. వృత్తిపరంగా చేనేత కార్మికులు అయి ఉండాలి. చేనేత సంఘంలో నమోదు చేసుకోవాలి. దారిద్ర్యరేఖ దిగువున ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఒకే కుటుంబంలో మగ్గాలు ఎన్ని ఉన్నా ఆ కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. సచివాలయాలు సిద్ధం చేసిన జాబితాను పరిశీలించి లబ్ధిదారులను గుర్తిస్తారు. వాలంటీర్లు, సిబ్బంది ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఎంట్రీ చేసి.. ఆ జాబితాను ఎంపీడీఓ లేదా ఎంసీలు పరిశీలించి చేనేత శాఖ ద్వారా తుది జాబితా ప్రకటిస్తారు. ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ లేని పక్షంలో ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు రాష్ట్ర చేనేత సంఘం జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెల్ల రేషన్ కార్డు, దారిద్ర్యరేఖ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా వివరాలు జత చేయాలి. ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద రూ. 24 వేలు జమ చేస్తున్న జగన్ సర్కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.