తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదన్న హైకోర్టు.. లాక్డౌన్ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం లాక్డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామన్నారు. లాక్డౌన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్డౌన్పై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆక్సిజన్ ప్రమాదాలపై సరైన వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలిపింది. పూర్తి వివరణ ఇవ్వాలంటూ మధ్యాహ్నం 2:30కు విచారణను వాయిదా వేసింది. ఏ రోజైతే తాము ఆదేశాలిచ్చామో.. అదే రోజు ప్రెస్ మీట్లు పెట్టి లాక్డౌన్ అవసరం లేదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఎలా చెబుతారని హైకోర్టు మండిపడింది.
ఇంటర్ స్టేట్ బార్డర్స్ నుంచి వస్తున్న అంబులెన్స్లను ఎందుకు అవుతున్నారని కేసీఆర్ సర్కార్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుంచి అంబులెన్స్లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని… వారిని ఆపమని మీకు ఎవరు చెప్పారంటూ హైకోర్టు ఫైర్ అయింది. హైదరాబాద్, రంగారెడ్డిలలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని ప్రశ్నించింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారంటూ మండిపడింది. పాతబస్తి ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకూ ఏజీ సమయం కోరారు. ఇతర వాహనాలను, ఇతర రోగులను తీసుకెళ్తున్న అంబులెన్సులను అనుమతిస్తున్నా.. కొవిడ్ రోగులతో వచ్చే అంబులెన్సులను మాత్రం వెనక్కి పంపడంతో సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అంబులెన్సులు నిలిచిపోయాయి.