చింత కాయ, పండు చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి. వెంటనే వాటికున్న గింజను తీసేసి ఠక్కున తినేస్తాం. గింజను పడేస్తాం. అయితే ఆగండి ఆ గింజను పడేయండి. దాచుకోమంటారా అని గుర్రుగా చూడకండి. ఈ వార్త చదివాక మీరే నిర్ణయించుకోండి ఆ విత్తనాన్ని ఏం చేయాలో.?
గతంలో వేసవి సెలవులు వచ్చాయంటే మహిళలంతా కలిసి అష్టా చెమ్మా, చింత పిక్కల గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఇంటి పట్టునే ఉండే మహిళలు మధ్యాహ్నం వేళ చింతకాయ గింజలతో రకరకాల గేమ్స్ ఆడేవారు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు పిక్కలు లేని చింత పండు వచ్చేయడంతో ఆ గేమ్స్కు బ్రేక్ పడింది. మనకేమైతే దూరమౌతున్నాయో వాటినే కొన్నింటినీ మార్కెట్ చేసుకుంటున్నాయి పలు ఆన్ లైన్ సంస్థలు. మన బిజీ లైఫ్ను, బద్ధకాన్ని క్యాష్ చేసుకుంటున్న సదరు సంస్థలు పండుగ సమయాల్లో అరిసెలు, బూరెలు, చక్రాలు, మామిడి ఆకులు, తోరణాలు అమ్ముతున్నాయి. చివరకు అరిటాకులు, పిడకలు కూడా నెట్టింట్లో అమ్మకానికి పెడుతున్నాయి. తాజాగా చింత పిక్కలు పెట్టి ఆశ్చర్యంలో ముంచెత్తింది ఓ ఆన్ లైన్ సంస్థ.
ఇంట్లో అమ్మ ఏదైనా పులుసు కూర వండితే.. ఒకటో రెండో చింత గింజలు వస్తే ఏం చేస్తుందీ. తినలేం కాబట్టి వాటిని పారేస్తుంది. అయితే చెప్పండి వాటిని పారేయొద్దనీ. ఎందుకంటే వాటిని కూడా అమ్మేస్తున్నాయి ఆన్ లైన్ సంస్థలు. చింతకాయల్ని, పండును అమ్మకానికి పెడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏకంగా చింత పిక్కలను అమ్మకానికి పెట్టింది ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఫ్లిఫ్ కార్ట్. మామూలు, కాల్చిన చింత గింజలను అమ్ముతోంది. వీటి ధర చూస్తే కూడా ఆశ్చర్యపోక మానరు. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 110గా నిర్ణయించింది. ఇంతకూ ఆ ప్యాకెట్లో ఎన్ని ఉంటాయో తెలుసా.. 100 మాత్రమే. అంటే ఒక్కో చింత పిక్క ధర ఒక్క రూపాయికి పై మాటే. అంతేకాకుండా వీటిని కొనుగోలు చేసిన వారు కూడా ఉన్నారు.
ఈ చింత విత్తనాలకు రేటింగ్స్, రివ్యూస్ కూడా ఇచ్చారంటే చూడండి వీటికి ఎంత డిమాండ్ ఉందో. గింజలకు క్యాష్ అన్ డెలివరీ కూడా చేయనుంది ఆ సంస్థ. చింత పిక్కలను అమ్మకానికి పెట్టడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చింత గింజలను కూడా వ్యాపారం చేస్తారని తెలిస్తే.. చిన్నప్పడి నుండే దాచేకునే వాళ్లమని కొందరూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వ్యాపారం చేసేందుకు ఏదీ అడ్డుకాదని నిరూపించిందీ సదరు సంస్థ. ఈ విత్తనాల్లో కూడా పోషక విలువలు మెండుగా ఉండటంతో వాటిని కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. వీటిని వేయించుకుని తింటారని సమాచారం. ప్రస్తుతం ఈ చింత గింజల వ్యాపారానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.