ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయిన వారి ముఖాలు కనబడకుండా పోలీసులు ఎందుకు ముసుగు వేస్తారు. వాళ్ళని మీడియాకి చూపిస్తే వాళ్ళ బతుకులేంటో అందరికీ తెలుస్తుంది కదా అని అనిపిస్తుంది. కానీ అలా ముసుగు వేయడానికి చట్టం ఒప్పుకోదు. దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే?
పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి నలుపు రంగు ముసుగు లేదా మంకీ క్యాప్ తొడుగుతారు. లేదంటే జేబు రుమాలు లేదా ఇతర గుడ్డ ముక్కతో సగం ముఖం కనబడకుండా కప్పుకోమని ఇస్తారు. న్యూస్ ఛానల్స్ లో, వార్తా పత్రికల్లో చూస్తే ముసుగుతో ఉంటారు. అరెస్ట్ చేసిన వ్యక్తికి ఎందుకు ఇలా ముసుగు కప్పుతారు. ఎందుకు క్రిమినల్ ముఖం దాచడం. ముసుగు తీస్తే జనాలకు అందరికీ నేరస్తుడి రూపం తెలుస్తుంది కదా. ఎప్పుడైనా జైలు నుంచి బెయిలు మీద బయటకి వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు కదా. అలా కాకుండా ముసుగు వేస్తే.. ఎప్పుడైనా జైలు నుంచి విడుదలై మళ్ళీ నేరం చేస్తే జనం గుర్తుపట్టలేరు కదా, దీని వల్ల ప్రమాదం కదా అని చాలా మందికి అనిపిస్తుంది. అయితే ఇలా ముసుగు తొడగడానికి కారణం ఉంది.
నేరం జరిగిన కేసులో ఒక వ్యక్తిని అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేరం చేశారని నిర్ధారణ కోర్టులో న్యాయమూర్తి తీర్పు తర్వాతే తేలుతుంది. ఒకవేళ కోర్టులో నిరూపణ అవ్వకపోతే అరెస్ట్ అయిన వ్యక్తిని న్యాయమూర్తి విడుదల చేయడం జరుగుతుంది. ఏ తప్పూ చేయకుండా అరెస్ట్ కాబడిన సందర్భంలో ఆ వ్యక్తి ముఖం అందరికీ కనిపిస్తే అతను సమాజంలో తలెత్తుకుని జీవించలేడు కాబట్టి ఇలా ముసుగు తొడుగుతారు. అతని ఆత్మాభిమానం, గౌరవం దెబ్బ తినకూడదని అనుమానితుల ముఖాలకు ముసుగు తొడగరు. అరెస్ట్ చేస్తే నేరస్థుడు అవ్వరు. అనుమానితుడు మాత్రమే అవుతారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోని పక్షంలో లేదా నేరం రుజువు కానంత వరకూ అరెస్ట్ అయిన వ్యక్తి అనుమానితుడు అవుతాడు. ప్రాథమికంగా నేరం రుజువయ్యే వరకూ ముసుగు తొడుగుతారు.
భారతీయ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం.. గుర్తించడం సాక్ష్యాలలో ఒకటి కాబట్టి సాక్ష్యం యొక్క పవిత్రతను కాపాడేందుకు ఈ ముసుగు ఉపయోగపడుతుంది. మరొక కారణం ఏంటంటే.. ఒకవేళ అరెస్ట్ చేయబడిన వ్యక్తి ముఖాన్ని దాచకుండా చూపిస్తే సాక్ష్యం చెప్పాలనుకున్న వ్యక్తి ఆ ముఖాన్ని పదే పదే చూడడం వల్ల అతనే నేరస్తుడు అని తనకు తాను ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఒక అమాయకుడి జీవితం నాశనమవుతుంది. అందుకే నలుగురైదుగురు వ్యక్తులను నిలబెట్టి నేరం చేసిన వ్యక్తిని గుర్తుపట్టమని సాక్షిని అడుగుతారు. వారిలో సరిగ్గా ఎవరు నేరం చేశారో చెబితే అప్పుడు కోర్టులో ప్రవేశపెడతారు. నేరం రుజువైతే అప్పుడు ముసుగు తొలగిస్తారు. అనుమానితుడు లేదా నేరస్తుడు ముఖం చూపించడం వల్ల ఫిర్యాదుదారుని లేదా సాక్షి తీర్పు తప్పవుతుంది. అందుకే సాక్షి గుర్తుపట్టేవరకూ అనుమానితుడి ముసుగు తీయరు.