పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తే అదే పండగ అనుకుని బతుకుతారు రైతులు. అలాంటిది గిట్టుబాటు ధర కంటే ఊహించని ధర వస్తే ఇక ఆ రైతులకు అంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి. సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది, సంపదలు తెచ్చి పెట్టింది అన్నట్టు.. కొంచెం ఎర్లీగానే మిర్చి రైతులకి సంక్రాంతి పండగ స్టార్ట్ అయ్యింది. మిర్చి పంట వేసిన రైతులకు ఈసారి ఊహించని లాభాలు వచ్చాయి. మిర్చి ధర రైతుల పాలిట బంగారంగా మారింది. వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్ లో దేశీ రకానికి చెందిన మిర్చి ఒక క్వింటాలు ధర రూ. 80,100 పలుకుతుంది. సాధారణంగా మామూలు మిర్చి అయితే ఒక క్వింటాలు ధర రూ. 20 వేల నుంచి 35 వేలు మాత్రమే ఉంటుంది.
అయితే ఖమ్మం రైతు తెచ్చిన చపాటా అనే దేశీ రకం మిర్చికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రత్యేక మిర్చి పంట సాగు చేస్తారు. చపాటా మిర్చిని ఖమ్మం రైతు నుంచి వరంగల్ ఎనుమాముల మార్కెట్ లోని ఓ వ్యాపారి రూ. 80,100 చెల్లించి మరీ కొనుగోలు చేశారు. ఈ మిర్చికి డిమాండ్ అధికంగా ఉందని, అందుకే ఆ ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు ఆ వ్యాపారి తెలిపారు. పచ్చళ్లలో ఎక్కువగా ఈ దేశీ మిర్చిని ఉపయోగిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ మిర్చికి అధిక డిమాండ్ ఉందని రైతులు చెప్పారు. ఈసారి దిగుబడి తక్కువగా ఉండడంతో ధర అధికంగా ఉందని.. మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గత ఏడాది క్వింటాలు మిర్చి ధర రూ. 90 వేలు పలికింది.
ఈసారి దిగుమతి తక్కువగా ఉన్న కారణంగా లక్ష పైనే పలికే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రావి చెట్టు తండాకు చెందిన రాములు నాయక్ అనే రైతు.. ఈ దేశీ మిర్చి బస్తాలను 4 మాత్రమే వరంగల్ ఎనుమాముల మార్కెట్ కి తీసుకొచ్చారు. అయితే అక్కడున్న వ్యాపారులు ఈ మిర్చి బస్తాలను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. చివరికి రూ. 80,100 కి చైత్ర ఎంటర్ప్రైజెస్ యజమాని కొనుగోలు చేశారు. జనవరి 6న ఎనుమాముల మార్కెట్ కి 3 వేల మిర్చి బస్తాలు వస్తే.. గంటన్నరలోనే మొత్తం బస్తాలను కొనేశారు వ్యాపారాలు. మార్కెట్ లో అడుగుపెట్టగానే వ్యాపారులు ఎగబడడం, తక్కువ సమయంలోనే బస్తాలు అమ్ముడైపోవడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మిర్చితో పచ్చళ్ళు చేసి.. విదేశాలకు ఎగుమతి చేశారు. విదేశాల్లో ఈ పచ్చళ్లకు విపరీతమైన డిమాండ్ ఉందని చైత్ర ఎంటర్పరైజెస్ యజమాని చెబుతున్నారు. అయితే గతంలో ఈ దేశీ రకానికి మిర్చి బస్తాలు రోజుకి 1000 నుంచి 2 వేలు మార్కెట్ కి వచ్చేవని.. ఇప్పుడు దిగుబడి తగ్గడంతో నాలుగైదు బస్తాలకు మించి రావడం లేదని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మును ముందు దేశీ మిర్చి క్వింటాల్ ధర లక్ష దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో.. చపాటా,తేజ, సింగిల్ పట్టీ, వండర్ హాట్, దీపికా, మిర్చి 1048, మిర్చి 341 వంటి మిర్చి రకాలను తీసుకొస్తుంటారు. దేశీ మిర్చినే కాకుండా.. సాధారణ మిర్చి కూడా మంచి లాభాలను తెచ్చి పెడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది మార్చిలో సాధారణ మిర్చి క్వింటాల్ ధర రూ. 52 వేలు పలికింది. వేసవి కాలం వస్తుండడంతో పచ్చళ్లకు గిరాకీ పెరుగుతుందని.. మిర్చికి డిమాండ్ కూడా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో మిర్చి ధర మును ముందు మరింత ఎక్కువ పలికే అవకాశం ఉందని నమ్ముతున్నారు. డిమాండ్ ఉంటే రైతులు తమ పంట కొనమని ఎదురుచూడక్కర్లేదు. డబ్బులొస్తాయంటే మార్కెట్ వాళ్ళే ఎగబడి కొంటారు. మిర్చి రైతుల్లానే వరి, పత్తి వంటి పంటలు వేసే రైతులకు కూడా ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. పంట పండించగానే ఎగబడి కొనే రోజులు వస్తే ఆ రైతుకి అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. మరి మిర్చి డిమాండ్ పెరిగి.. రైతులకు లాభాలను తెచ్చిపెట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.