హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ లోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దావానంలా మారిపోయింది. అక్కడ ఉన్న కొన్ని నాలుగు రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలాయి. ప్రమాదంలో హరిప్రసాద్, అర్జున్, మనీష్ బస్కీ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ అనే కార్మికుడి ఆచూకీ తెలియడం లేదు.
పరిశ్రమలోని రసాయన డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. ప్రమాదం జరిగిన స్థలంలో మరో ఏడు వరకు రియాక్టర్లు ఉన్నాయి. వాటికి మంటలు వ్యాపించకుండా ఫైర్ ఇంజిన్లు, ట్యాంకర్లతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీడిమెట్లలో తరచూ అగ్నిప్రమాదాలు జరగడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
రసాయన పరిశ్రమల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని అటు అధికారులు కూడా ఏ మాత్రం తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మే నెల నుంచి ఇప్పటి వరకు పది పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని ఏదో హాడావుడి చేస్తున్నారు తప్ప ఆ తర్వాత కనీసం ఆ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదంటున్నారు స్థానికులు.ప్రమాదంలో గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలే ఆర్ట్ లాబ్స్ లో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని యశోద అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయన్న సంగతి మరువక ముందే ఈ ఘటన జరగడం విషాదం.